ఐఫోన్ కొనకుండా.. EMI డబ్బు ఇలా ఇన్వెస్ట్ చేస్తే రూ.17 లక్షలు మీవే! AI చెప్పిన అద్భుత ప్లాన్
బెంగళూరులో నెలకు రూ.70,000 సంపాదించే ఉద్యోగి, రూ.20,000 పొదుపును ఐఫోన్ EMIకి వినియోగించాలా లేక పెట్టుబడులు పెట్టాలా అనే ప్రశ్నకు AI ఆసక్తికర విశ్లేషణ ఇచ్చింది. ఐదేళ్లపాటు మ్యూచువల్ ఫండ్లు, PPF, బంగారంలో పెట్టుబడి పెడితే రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు సంపద సృష్టించే అవకాశం ఉందని సూచించింది.

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో జీవన వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. అద్దె, ఆహారం, రవాణా, ఇంటి నిర్వహణ వంటి ఖర్చులు ఎక్కువ కావడంతో ఉద్యోగులు సంపాదనలో పెద్ద భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మిగిలే కొద్దిపాటి పొదుపును ఎలా వినియోగించాలి అనే ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఇదే అంశంపై ఒక ఉద్యోగి AI చాట్బాట్ అయిన చాట్జీపీటీని ఆశ్రయించగా, వచ్చిన సమాధానం సోషల్మీడియాలో చర్చనీయాంశమైంది.
25 ఏళ్ల ఉద్యోగి నెలకు రూ.70,000 సంపాదిస్తూ, దాదాపు రూ.50,000 ఖర్చు చేస్తున్నట్లు వివరించాడు. తనకు మిగిలే రూ.20,000ను EMIపై ఐఫోన్ కొనడానికి వినియోగించాలా లేక పెట్టుబడులుగా మలచాలా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన AI, ఐఫోన్ కొనడం విలువ తగ్గే ఖర్చు కాగా, పెట్టుబడులు భవిష్యత్తులో ఆస్తిని సృష్టించే అలవాటు అని పేర్కొంది. AI అంచనాల ప్రకారం నెలకు రూ.20,000ను ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.12 లక్షలకు చేరుతుంది. ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, బంగారం, PPF వంటి పథకాలలో విభజించి పెట్టుబడి పెడితే సగటున 9 నుంచి 12 శాతం వరకు వార్షిక రాబడి లభించే అవకాశం ఉందని తెలిపింది. ఆ ప్రకారం ఐదేళ్ల తర్వాత మొత్తం కార్పస్ రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది.
మరోవైపు EMIపై ఐఫోన్ కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ ఫీజులు, అవకాశ వ్యయం వంటి అదనపు భారం ఉంటుందని పేర్కొంది. ఫోన్ విలువ కాలక్రమేణా తగ్గిపోతుందని, 3-4 సంవత్సరాల తర్వాత పునఃవిక్రయ విలువ కూడా చాలా తక్కువగా ఉంటుందని వివరించింది. అయితే అవసరమైతే మాత్రమే ఖరీదైన ఫోన్ కొనాలని, లేదంటే ముందుగా పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని AI సూచించింది. నెలకు రూ.18,000 నుంచి రూ.19,000 వరకు పెట్టుబడి పెట్టి, ఐఫోన్ కోసం ప్రత్యేకంగా కొంతకాలం పొదుపు చేయడం ఉత్తమ మార్గమని అభిప్రాయపడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
