ఆరు వారాల్లో ఆరు కంపెనీలు… జియోలోకి మరో కంపెనీ
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్బుక్, సిల్వర్ లేక్ వంటి బడా కంపెనీలను ఆకర్షించిన జియో తాజాగా అబుదాబికి చెందిన ముబాదల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టింది.
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్బుక్, సిల్వర్ లేక్ వంటి బడా కంపెనీలను ఆకర్షించిన జియో తాజాగా అబుదాబికి చెందిన ముబాదల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టింది. దీంతో ఆరు వారాల్లో ఆరు దిగ్గజ కంపెనీలు నుంచి పెట్టుబడులను సేకరించగలిగింది జియో.
జియో ప్లాట్ఫామ్స్లో ఈ భారీ ఒప్పందాన్ని అధికారికంగా ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ… అబుదాబి నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని ప్రపంచంతో అనుసంధానించడంలో ముబాదల ఎంత కీలకపాత్ర పోషించిందని ముకేశ్ తెలిపారు. “జియో”ని భారతదేశప్రజలకు మరింత దగ్గర చేయడంలో వారి అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు.
అయితే జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ రూ.9,093.6 కోట్ల పెట్టుబడుల ద్వారా 1.85 శాతం వాటాను కైవసం చేసుకునేందుకు ముబాదల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని (జూన్ 05) శుక్రవారం ఆర్ఐఎల్ స్వయంగా ప్రకటించింది. దీంతో జియో సేకరించిన మొత్తం పెట్టుబడులు విలువ రూ.87,655.35 కోట్లకు చేరింది. ఆరు భారీ ఒప్పందాల ద్వారా 18.97 శాతం వాటాలను విక్రయించింది.