లాక్డౌన్ ఎఫెక్ట్: కూతురి పెళ్లి ఆగిపోయిందనే బెంగతో తండ్రి మృతి
లాక్డౌన్ ఎఫెక్ట్తో పలుచోట్ల విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కూతురి పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు.
కరోనా వైరస్ మహమ్మారి అన్ని రకాలకు మనుషుల్ని పట్టిపీడిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు తగిన సదుపాయాలు చేపడుతున్నప్పటికీ ఇళ్లలోనే ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు అవస్థలు తప్పటం లేదు. కొందరు మనస్తాపంతో ప్రాణాలు కొల్పోతున్నారు. ఇటువంటిదే ఆంధ్రప్రదేశ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే…
శ్రీకాకుళం జిల్లాలోని మందసకు చెందిన వెంకటరావు అనే వ్యక్తి కూతురు పెళ్లి ఆగిపోతుందన్న బెంగతో గుండెపోటుకు గురై బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. మందస మండలంలోని పిడిమందసకు చెందిన వెంకటరావు వైజాగ్ స్టీల్ప్లాంట్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తెకు గురువారం వివాహం జరగాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం వెంకటరావు వివాహ శుభలేఖలు పంచేందుకు విశాఖపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.లాక్డౌన్ కారణంగా తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక విశాఖపట్నంలోనే చిక్కుకున్నారు. అటు, వరుడి తల్లి కూడా బంధువులకు శుభలేఖలు పంచేందుకు హైదరాబాదు వెళ్లి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
ముహూర్తం దగ్గరపడడంతో కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే బెంగతో వెంకటరావు కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ బెంగతోనే అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో హుటాహుటినా మృతదేహాన్నిస్వగ్రామానికి తరలించారు. పోలీసుల సూచన మేరకు వెంటవెంటనే దహన సంస్కారాలు పూర్తిచేశారు. పెళ్లి జరగాల్సిన ఇంట చావు చూడాల్సి వచ్చిందని వెంకటరావు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.