Sovereign Gold Bond: మార్చి 5తో ముగియనున్న సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు.. ఆన్‌లైన్ బంగారం కొనేది ఎలా..?

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1న ప్రారంభించింది భారత రిజర్వ్ బ్యాంక్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సిరీస్. ఈ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2021 మార్చి 5న ముగియనుంది.

Sovereign Gold Bond: మార్చి 5తో ముగియనున్న సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకాలు.. ఆన్‌లైన్ బంగారం కొనేది ఎలా..?
Follow us

|

Updated on: Mar 03, 2021 | 9:34 PM

Sovereign Gold Bond Scheme 2021 : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ 12 అమ్మకాలు మార్చి 1న ప్రారంభించింది భారత రిజర్వ్ బ్యాంక్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి సిరీస్. ఈ గోల్డ్ బాండ్ అమ్మకాలు 2021 మార్చి 5న ముగియనుంది. ఈ సిరీస్‌కు ధరను ఫిక్స్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్ ధర రూ.4,662 గా నిర్ధారించింది. అయితే, ఆన్‌లైన్‌లో కొనేవారికి రూ.50 డిస్కౌంట్ ఇస్తుందని పేర్కొంది ఆర్‌బీఐ. అంటే ఒక గ్రాము బంగారాన్ని రూ.4,612 ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రతీ సారి గత మూడు రోజుల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛత గల బంగారానికి నిర్ణయించిన ధరను యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది ఆర్‌బీఐ. అంటే ఫిబ్రవరి 24 నుంచి 26 మధ్య ఉన్న బంగారం ధరను యావరేజ్ చేసి గ్రాముకు రూ.4,662 ధరను ఫిక్స్ చేసింది. ఈ సిరీస్‌లో గోల్డ్ బాండ్స్ కొన్నవారికి 2021 మార్చి 9న సెటిల్మెంట్ అవుతుంది.

ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు. బంగారం ధరలలో ప్రయోజనం కాకుండా, ఈ బాండ్లు పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టిన మొత్తంపై 2.5 శాతం స్థిర వడ్డీని అందిస్తాయి. వడ్డీని ఆరునెల‌ల‌కోసారి చెల్లిస్తారు. బంగారు బాండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. లాభాలు, బంగారు బాండ్ల వడ్డీ ఆదాయానికి ఎలా పన్ను వ‌ర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బంగారు బాండ్లకు మెచ్యూరిటీ వ్యవధి ఎనిమిది సంవత్సరాలు. కాబట్టి, ఈ బాండ్లను కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు కొన‌సాగిస్తే, మూలధన లాభాలు పన్ను రహితంగా ఉంటాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన తిరిగి చెల్లించిన తేదీ నుంచి మునుపటి 3 పనిదినాలలో 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా పెట్టుబడిదారులు బంగారు బాండ్లను తిరిగి పొందవచ్చు. ఐదవ సంవత్సరం నుంచి ముంద‌స్తు ఉపసంహరణ కూడా చేసుకునే అవ‌కాశం ఉంది. మెచ్యూరిటీకి ముందే తీసుకోవాల‌నుకునేవారు కూపన్ చెల్లింపు తేదీకి ముప్పై రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు పెట్టుబడిదారుడు సంబంధిత బ్యాంక్ / పోస్టాఫీసును సంప్రదించినట్లయితే మాత్రమే ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ కోసం అభ్యర్థనలు ఆమోదం పొందగలవు. బాండ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అందించిన బ్యాంక్ ఖాతాకు ఆదాయం జమ అవుతుంది. ఐదవ సంవత్సరం తరువాత తీసుకుంటే లాభాల‌పై పోస్ట్ ఇండెక్సేషన్‌తో 20 శాతం పన్ను వర్తిస్తుంది.

బంగారు బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా జాబితా చేస్తారు. వాటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఒకవేళ అవి ఒక సంవత్సరానికి ముందే విక్రయిస్తే వ‌చ్చిన లాభాల‌ను పెట్టుబడిదారుడి ఆదాయానికి క‌లిపితే శ్లాబు రేటు ప్రకారం పన్ను ఉంటుంది. ఒక సంవత్సరం తరువాత లాభాలను దీర్ఘకాలికంగా ప‌రిగ‌ణిస్తారు, 10 శాతం ప‌న్ను ప‌డుతుంది. కాగా, బంగారు బాండ్లపై వచ్చే వడ్డీ నేరుగా పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో చేరుతుంది. దీనిపై పూర్తిగా పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం పెట్టుబడిదారుడి ఆదాయానికి జోడించి, శ్లాబు రేటు ప్రకారం పన్ను లెక్కిస్తారు. అయితే చెల్లించిన వడ్డీపై టీడీఎస్ వర్తించదు.

ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా సార్వభౌమ ప‌సిడి బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలు ఉంది. అది ఎలాగంటే…

* ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.

* ఇ-స‌ర్వీస్ ఆప్షన్‌లో ఉన్న సావ‌రిన్ గోల్డ్ బాండ్‌పై క్లిక్ చేయాలి

* ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ బాక్స్‌లో టిక్ చేసి ప్రాసీడ్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

* రిజిస్ట్రేష‌న్ ఫార‌మ్‌ను పూర్తి చేసి స‌బ్మిట్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే స‌రిపోతుంది.

* గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు.

* ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం.

* క‌నీసం ఒక గ్రాము నుంచి పెట్టుబ‌డి పెట్టవ‌చ్చు.

* వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు గ‌రిష్టంగా 4 కేజీల వ‌ర‌కు, సంస్థలు 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండిః పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..