రోడ్డెక్కిన హైదరాబాద్ సిటీ బస్సులు
కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సిటీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు ఆరు నెలల తర్వాత నగర శివార్లలో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ బస్సు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి.
సామాన్యుడి రథచక్రాలు కదిలాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సిటీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. హైదరాబాద్ నగర శివార్లలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు ఆరు నెలల తర్వాత నగర శివార్లలో ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ బస్సు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి.
బుధవారం తెల్లవారుజాము నుంచి 200లకు పైగా బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రతి డిపో నుంచి 12 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. అయితే నగరంలో సిటీ బస్సుల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ఇక లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు జిల్లాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ నగరంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రత తగ్గకపోవడంతో సిటీ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. మరోవైపు త్వరలోనే సిటీ బస్సులు కూడా నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు.
అయితే ఇదే అంశంపై రెండు, మూడు రోజుల్లో అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని ఆర్టీసీ డిపోలను ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు.