ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు చుక్కెదురు..
ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. మంగళగిరి మండలం ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు ఎమ్మెల్యే ఆర్కే.
ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. మంగళగిరి మండలం ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు ఎమ్మెల్యే ఆర్కే. అయితే ఆర్కే దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు కొట్టివేసింది.
టీడీపీ ఆఫీసు నిర్మాణానికి వాగుకు చెందిన 3.65 ఎకరాల్ని 99 ఏళ్ల పాటు లీజు కింద కేటాయించారని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్లో పేర్కొన్నారు. భూ కేటాయింపు జీవో 228ని రద్దు చేయాలని కోర్టును కోరారు. పర్యావరణ చట్టాల ప్రకారం..చెరువులు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఆర్కే ప్రస్తావించారు. అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆర్కే కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిల్ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. గతంలోనే దీనిపై రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిల్ వేయటంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని ప్రశ్నించింది.