బాలుడి ప్రాణాలను బలితీసుకున్న పబ్జీ గేమ్.. స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య
పబ్జీ గేమ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పబ్జీ ఆటకు అలవాటుపడ్డ బాలుడు మానలేకపోయాడు. పబ్జీ ఆడేందుకు తండ్రి కొత్త స్మార్ట్ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పబ్జీ గేమ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పబ్జీ ఆటకు అలవాటుపడ్డ బాలుడు మానలేకపోయాడు. పబ్జీ ఆడేందుకు తండ్రి కొత్త స్మార్ట్ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన అనంతయ్య, లలితమ్మ దంపతులు కులకచర్ల గేటు వద్ద పండ్లు, పూజా సామగ్రి దుకాణం నడుపుకొంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు ఓంకార్(15) గ్రామంలోనే పదో తరగతి చదువుతున్నాడు. కొద్దికాలంగా ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఓంకార్ పబ్జీ గేమ్కు అలవాటుపడ్డాడు. ఇదే క్రమంలో పబ్జీ ఆటకు బానిసయ్యాడు. పబ్జీ కోసం తనకు కొత్త స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇందుకు ఆర్థిక పరిస్థితి సరిగాలేదనీ, దుకాణంలో తనకు చేదోదువాదోడుగా ఉండాలని తండ్రి అనంతయ్య మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఓంకార్ బుధవారం అర్ధరాత్రి ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.