క్యాన్సర్తో బాధపడుతున్న మాజీ బాక్సర్, బంగారు పతక విజేతకు కరోనా..!
ప్రముఖ బాక్సర్, 1998 ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత డింగ్కో సింగ్కి కరోనా సోకింది. ఇప్పటికే లివర్ క్యాన్సర్(కాలేయ క్యాన్సర్)తో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్
ప్రముఖ బాక్సర్, 1998 ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత డింగ్కో సింగ్కి కరోనా సోకింది. ఇప్పటికే లివర్ క్యాన్సర్(కాలేయ క్యాన్సర్)తో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ కోసం గత నెల ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత స్వరాష్ట్రం మణిపూర్కి తిరిగి వచ్చారు.
ఢిల్లీలో డింగ్కో సింగ్కి సేవలు అందించిన నర్సుకి కరోనా సోకగా.. ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల్లో డింగ్కోకి నెగిటివ్గా తేలింది. ఆ తరువాత మణిపూర్కి వచ్చిన తరువాత చేసిన పరీక్షల్లో డింగ్కో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఆయనతో కాంటాక్ట్ అయిన అందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్లో తీసుకుని వెళ్లే సమయంలో డింగ్కోకి కరోనా సోకి ఉండొచ్చని వారు చెబుతున్నారు.
కాగా 1998 బ్యాంకాక్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో భారత్ తరఫున బరిలోకి దిగిన డింగ్కో బంగారు పతకాన్ని సాధించారు. అదే సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు అర్జున అవార్డును ప్రధానం చేసింది. అలాగే 2013లో డింగ్కో భారత అత్యున్నత పురష్కారాల్లో నాలుగవదైన పద్మ శ్రీ ని అందుకున్నారు. ఇక భారత నేవీలో సైతం పనిచేసిన డింగ్కో బాక్సింగ్ కోచ్గా కూడా పనిచేశారు. ఆ తరువాత క్యాన్సర్ బారిన పడటంతో ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ సహా పలువురు డింగ్కోని తమ ఆదర్శంగా చెబుతుంటారు.
Read This Story Also: సరిహద్దుల్లో ఉగ్ర కుట్ర… తిప్పికొట్టిన సైన్యం