బీజేపీ ఏ హిందువుకైనా టికెట్ ఇస్తుంది, కానీ ముస్లిములకు మాత్రం ససేమిరా, కర్ణాటక మంత్రి
తమ పార్టీ ఏ హిందువుకైనా టికెట్ ఇస్తుందని, కానీ ముస్లిములకు మాత్రం ఇవ్వదని అన్నారు కర్ణాటక మంత్రి ఒకరు. గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి అయిన కె.ఎస్. ఈశ్వరప్ప.. ఈ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
తమ పార్టీ ఏ హిందువుకైనా టికెట్ ఇస్తుందని, కానీ ముస్లిములకు మాత్రం ఇవ్వదని అన్నారు కర్ణాటక మంత్రి ఒకరు. గ్రామీణాభివృధ్ది శాఖ మంత్రి అయిన కె.ఎస్. ఈశ్వరప్ప.. ఈ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. లింగాయతులైనా. ఒక్కళిగులైనా, బ్రాహ్మణులైనా..ఎవరైనా సరే.. వారికి పార్టీ టికెట్ లభిస్తుంది..కానీ ముస్లిములకు ఇచ్ఛే ప్రసక్తి లేదు అని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న బెళగావి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా బెంగుళూరులో మాట్లాడిన ఆయన.. స్వాతంత్య్ర సమర యోధులైన కిట్టూర్ చెన్నమ్మ అనుయాయులకు తమ పార్టీ టికెట్ ఇస్తుందో,లేదో తెలియదన్నారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్న విషయం గమనార్హం. అటు వీర శైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేబినెట్ సిఫారసు పై సీఎం ఎడ్యూరప్ప తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ కులానికి చెందిన ఎడ్యూరప్ప తన స్థానాన్ని పటిష్టపరుచుకునేందుకు ఈ ప్రతిపాదన చేశారు. అయితే కేబినెట్ లో కొంతమంది సహచర మంత్రులే పరోక్షంగా ఇందుకు తమ విముఖత తెలియజేయడంతో ఆయన వెనక్కి తగ్గారు.
కర్ణాటకలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలే ఎడ్యూరప్ప నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తన బంధువర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించినప్పుడు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. లోగడ ఒక దశలో ఆయనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిధ్ధపడ్డారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరుగుతోందన్న విపక్ష నేతల అభిప్రాయాలతో వారు ఏకీభవించడం విశేషం.