Bandi Sanjay : స్పీడ్ పెంచిన తెలంగాణ బీజేపీ.. ఓరుగల్లులో బండి సంజయ్ పర్యటనకు భారీ స్పందన..
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత స్పీడ్ పెంచిన బీజేపీ...ఏదో ఒక కార్యక్రమం చేపడుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించినా.. కొత్త పాలకవర్గం కొలువుదీరకపోవడంపై బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.
Bandi Sanjay : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత స్పీడ్ పెంచిన బీజేపీ…ఏదో ఒక కార్యక్రమం చేపడుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించినా.. కొత్త పాలకవర్గం కొలువుదీరకపోవడంపై బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రగతిభవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్పొరేటర్లు. మేయర్ ఎన్నిక కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులతో తోపులాటకు దిగటంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. హరిత హోటల్లో కార్పొరేటర్ల మీటింగ్కు పర్మిషన్ తీసుకున్నారు. బయటికొచ్చిన తర్వాత ఒక్కసారి ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.
మరోవైపు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓరుగల్లులో పర్యటించారు. ఈసందర్భంగా బీజేపీ శ్రేణులు కడిపికొండ బ్రిడ్జి నుంచి భారీ ర్యాలీ నిర్వహించాయి. జనగామతో పాటు వరంగల్లో పర్యటించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు సంజయ్. విష్ణుప్రియ గార్డెన్స్లో జరిగిన మీటింగ్లో ఇతర పార్టీలనుంచి బీజేపీలో చేరినవారిని కండువాలు కప్పి ఆహ్వానించారు.
వరంగల్ పర్యటనలో బండి సంజయ్ పరామర్శ ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ దేవాలయం ముందు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయటంతో.. బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చివరికి తీవ్ర ఉద్రిక్తత మధ్యే పోచమ్మమైదాన్ సాయిబాబా మందిరాన్ని సందర్శించి.. రెండేళ్లక్రితం హత్యకు గురైన ఆలయ పూజారి కుటుంబాన్ని పరామర్శించారు బండి సంజయ్.