గ్రేటర్ ఎన్నికలపై కమలం గురి !
జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ గురిపెట్టింది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో జరిగి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆయా సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యతనిస్తూ ప్రాంతాలు, డివిజన్ల వారీగా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమలం కసరత్తు చేస్తోంది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో హైదరాబాద్కు ఉన్న ఒకే ఒక అధ్యక్ష పదవికి స్వస్తి పలికి ఆ స్థానంలో నలుగురు అధ్యక్షులను నియమించారు. అలాగే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సైతం అధ్యక్షులను ప్రకటించారు. బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాగతంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికలు మంచి అవకాశంగా కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి.
అందులో భాగంగానే హైదరాబాద్ను ఆరు జిల్లాలుగా చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వనికి సూచిందింది. హైదరాబాద్ను నాలుగు విభాగాలుగా చేసి రంగారెడ్డి , మేడ్చల్ను రెండు భాగాలుగా ఆయా సామాజిక వర్గాలకు ప్రాధన్యత కల్పిస్తూ నూతన అధ్యక్షులను ప్రకటించారు. సికింద్రాబాద్ , గోల్కొండ ప్రాంతాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వగా అంబర్పేటలో వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మలక్పేట, మేడ్చల్ అర్బన్ – రూరల్, రంగారెడ్డిలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్య కల్పించారు. సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలు, డివిజన్ల వారీగా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 85 సీట్లు రిజర్వుడు ఉన్నాయి. ఓపెన్ సీట్లు 65 ఉంటే అందులో 30 సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అందుకే బీజేపీ కొత్తగా ప్రకటించిన అధ్యక్షుల్లో నలుగురు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు. అటు అంబర్పేటలో గౌతంరావు లాంటి నేతకు బాధ్యతలను అప్పగించి సీనియార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. సికింద్రాబాద్లో శ్యామ్ సుందర్గౌడ్కు అవకాశం ఇచ్చి బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.
నిజానికి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అంత బలంగా లేదు. కార్పోరేట్ ఎన్నికల్లో ఇటు టీఆర్ఎస్ అటు ఎంఐఎం పార్టీలే ఎక్కువగా సత్తా చాటుతున్నాయి. గతంలో మల్కాజిగిరి, సైదాబాద్, ఎల్బీనగర్ డివిజన్లలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కొత్త ప్రయోగానికి తెరలేపింది.
ఢిల్లీ, బెంగళూరు, కర్ణాటక లాంటి నగరాల్లో ఎక్కువ జిల్లాలుగా విభజించి ఆర్గనైజింగ్ చేస్తున్న విధానాన్ని ప్రస్తుతం హైదరాబాద్ లో అమలు చేస్తున్నట్లు కన్పిస్తోంది. అందులోనూ ప్రాంతాల వారీగా అన్ని సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేస్తూ కమల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయాలని అంటున్నారు. ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎం ఏ పార్టీకి ఓటేసినా అది టీఆర్ఎస్కు వేసినట్లేనని అంటున్నారు.