ప్రకాశంలో ప్రకాశానికి సూపర్ ప్లాన్.. బిజెపి ఆకర్ష్ అదుర్స్ !

ఎపిలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కమల నేతలు వ్యూహం రచిస్తున్నారా…టిడిపిలో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంపై బిజెపి దృష్టి పెట్టిందా…అందులో భాగంగానే ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా మాజీ టీడీపీ నేత, మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును తెరపైకి తెస్తున్నారా… టీడీపీలో అసంతృప్తి నేతలను బిజెపిలోకి ఆహ్వనించేందుకు ఇప్పటికే రంగం సిధ్దమైందా…స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు బిజెపి పావులు కదుపుతోందా…బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్‌ టార్గెట్‌ టిడిపి […]

ప్రకాశంలో ప్రకాశానికి సూపర్ ప్లాన్.. బిజెపి ఆకర్ష్ అదుర్స్ !
Follow us

|

Updated on: Nov 18, 2019 | 4:40 PM

ఎపిలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కమల నేతలు వ్యూహం రచిస్తున్నారా…టిడిపిలో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గంపై బిజెపి దృష్టి పెట్టిందా…అందులో భాగంగానే ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా మాజీ టీడీపీ నేత, మాజీ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును తెరపైకి తెస్తున్నారా… టీడీపీలో అసంతృప్తి నేతలను బిజెపిలోకి ఆహ్వనించేందుకు ఇప్పటికే రంగం సిధ్దమైందా…స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు బిజెపి పావులు కదుపుతోందా…బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్‌ టార్గెట్‌ టిడిపి జోరుగా సాగుతోందా…అవుననే అంటున్నారు బిజెపి నేతలు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు బూతు పురాణాలు, తిట్ల దండకాలతో కాక మీదున్నాయి. అటు బిజెపి, ఇటు వైసిపి నేతలు టిడిపి నేతలతో పాటు ఏకంగా అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు. ప్రధానంగా వైసిపి నేతల తాకిడిని తట్టుకోలేక తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు… నిన్నటి వరకు టిడిపిలో ఉన్న వల్లభనేని వంశీ, వైసిపి కృష్ణా జిల్లా రాజకీయల్లో కీలక నేత, మంత్రి కొడాలి నాని గత రెండు రోజులుగా టిడిపి అధినేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నా…టిడిపి మాత్రం ప్రత్యర్ధుల దాడిని సమర్ధవంతంగా తిప్పి కొట్టలేకపోతున్నారని టిడిపి క్యాడర్‌ అసంతృప్తిగా ఉందట…దీంతో ఇదే సరైన అదనుగా భావించి టిడిపిలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న నేతలను బిజెపి టార్గెట్‌ చేసిందని చెప్పుకుంటున్నారు.

ప్రధానంగా టిడిపి స్థానిక నేతలతో పాటు ఒకరిద్దరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీకి పునాదులు పడతాయని భావిస్తున్నారట…అందులో భాగంగా ఇప్పటికే టిడిపి నుంచి బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ ఛైర్మన్‌ ఈదర హరిబాబుకు ప్రకాశంజిల్లా బిజెపి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈదర హరిబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతగా ఉన్నారు. 1994లో టిడిపి టికెట్‌పై పోటీ చేసి ఒంగోలు ఎమ్మెల్యేగా ఈదర హరిబాబు గెలుపొందారు…ఆ తరువాత టిడిపి నుంచి టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా, అనంతరం మరోసారి టిడిపి టికెట్‌పై ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తరువాత నాటకీయ పరిణామాల నేపధ్యంలో జడ్‌పి ఛైర్మన్‌గా ఈదర హరిబాబు పనిచేశారు. ఆయన పదవీ కాలం 2019 జూలై 4వ తేదితో ముగిసింది. ఈదర హరిబాబు రాజకీయ అనుభవం నేపధ్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను అధిష్టానం సేకరిస్తున్నట్టు సమాచారం…ఒకరిద్దరు నేతలు ఈదర హరిబాబు నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈదరకు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, దగ్గుబాటి పురందేశ్వరిలతో మంచి సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఆయన నియామకం ఖాయమని క్యాడర్‌ చెప్పుకుంటున్నారు.

మరోవైపు వైసిపి పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలను ముందుగానే కలిసి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని భావించి బిజెపి ఎంపి సుజనా చౌదరి పావులు కదుపుతున్నారట…రాష్ట్రంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్న వేళ…ప్రకాశంజిల్లాలో కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ నేతలను కలవడం చర్చనీయాంశమైంది. దీంతో టిడిపిలోని కీలక నేతలు పార్టీ వీడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.

ఒంగోలులో ఇటీవల పర్యటించిన సుజనా చౌదరిని టిడిపికి చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కలిసి విందులో పాల్గొనడం అప్పట్లో కలకలం రేపింది. ఇద్దరూ బంధువులే కావడంతో మధ్యాహ్నం లంచ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆశక్తికర అంశాలు మాట్లాడుకున్నట్టు తెలిసింది. అయితే బయటకు వచ్చిన తరువాత మాత్రం తమ భేటీలో రాజకీయాలు లేవని, కేవలం వ్యక్తిగత బంధుత్వం కారణంగా విందులో పాల్గొన్నామని కరణం బలరాం స్పష్టం చేశారు. అయినా అప్పటికే వీరిద్దరి భేటీపై ఉత్కంఠ చర్చ నడిచింది.

కరణం బలరాం కూడా వైసిపిలోకి వెళ్ళేందుకు రంగం సిద్దమైందని, ఈ నేపద్యంలోనే బలరాంను సుజనాచౌదరి పిలిపించుకుని బిజెపిలోకి వస్తే ప్రకాశం జిల్లా పగ్గాలు అప్పగిస్తామని, కేంద్రస్థాయిలో మంచి పదవి కూడా ఆఫర్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని కరణం బలరాం చెబుతున్నారట. తాను టిడిపి పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరే ప్రసక్తేలేదని పార్టీ కేడర్‌కు స్పష్టం చేస్తున్నారట…

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి సభ్యత్వ లక్ష్యం 25 లక్షలుగా టార్గెట్‌ పెట్టుకున్నారు. ఆపరేషన్‌ ఎపి పేరుతో జూన్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారని, ముందుగానే ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ఈ నేతలను పార్టీలో చేర్చుకునే విధంగా ప్లాన్‌ చేశారని ప్రచారం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రకాశంజిల్లాలో పలువురు బిజెపి అగ్ర నేతలు పర్యటించారు. బిజెపి అంతర్గత సమావేశంలో పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.

టిడిపి నేతలకు గాలం వేసేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నాలకు సమాంతరంగా ఇటు బిజెపి నేతలు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సఫలం కాకపోయినా గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంతమంది నేతలు బిజెపిలో చేరేందుకు ఆశక్తి చూపిస్తున్నారట…అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు కార్పోరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా బిజెపి నేతలు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో బిజెపి ఆపరేషన్‌ ఆకర్ష్ ఏ మేరకు ప్రకాశం జిల్లాలో ప్రకాశిస్తుందో వేచి చూడాలి..