బీజేపీ నెక్స్ట్ టార్గెట్.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక, జానారెడ్డి తనయుడితో రంగంలోకి దిగాలని ప్లాన్.!
దుబ్బాక ఉపఎన్నికలో విజయ బావుటా, గ్రేటర్ లో అనూహ్య విజయాలతో బీజేపీ ఫుల్ జోష్ మీద ఉంది. అదే ఊపుతో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ..
దుబ్బాక ఉపఎన్నికలో విజయ బావుటా, గ్రేటర్ లో అనూహ్య విజయాలతో బీజేపీ ఫుల్ జోష్ మీద ఉంది. అదే ఊపుతో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ తొడగొట్టేందుకు ఆపార్టీ నడుంకడుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల సమయంలో బై పోల్ రూపంలో కమలదళం మరో పరీక్షకు రెడీ అయిపోతోంది. నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కంచుకోటలో జానారెడ్డి సీనియర్ నేతకు మంచి పట్టు ఉంది. తెలంగాణలో జెండా ఎగురవేస్తామని కలలు కంటున్న బీజేపీకి ఇక్కడ చాన్స్ ఉందా? అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఉప ఎన్నికలో గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్లో బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు. ఆ పార్టీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డికి కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 1.48 శాతం ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో రెడ్డి లేదా యాదవ్ సామాజికవర్గాలు బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. దీంతో ఈ వర్గాల నుంచే ఈ సారి క్యాండేట్లను పెట్టాలని బీజేపీ చూస్తోంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటి అంటే కాంగ్రెస్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్రెడ్డిని బీజేపీలోకి లాగాలని చూస్తోందట. తమ పార్టీ తరపున పోటీ చేయాలని సంప్రదింపులు జరుపుతోందట. బీజేపీ నేత డీకే అరుణ రఘువీర్తో టచ్లోకి వెళ్లిందట. ఆమె ఆధ్వర్యంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయట. అయితే జానారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లో లేరు. తండ్రి వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రఘువీర్ చెప్పారట. కాంగ్రెస్ తరపున జానారెడ్డి ఉంటే..బీజేపీ తరపున కొడుకును నిలబెట్టాలనేది బీజేపీ ప్లాన్. కాంగ్రెస్ను ఓట్లను చీల్చి గెలవాలని కమలం ఎత్తుగడ. అయితే తండ్రి కాంగ్రెస్ వాదిని కాదని రఘువీర్రెడ్డి బీజేపీలోకి వస్తాడా? అనేది ఇప్పుడు బిగ్ కొశ్చన్. మరోవైపు జానారెడ్డి కాంగ్రెస్ను వీడి కొడుకు బీజేపీలోకి పంపిస్తారా? అనేది మరో డౌట్. అయితే ఫస్ట్ ఆప్షన్ ఒకే కాకుండా ప్లాన్ బీకి రెడీ కావాలని బీజేపీ చూస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి బలమైన నేత దొరక్కపోతే యాదవ్ను బరిలోకి దించాలని చూస్తోందట. మొత్తానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పరీక్షలో నెగ్గాలని బీజేపీ ప్లాన్లు గీస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త సవాల్ విసిరేందుకు బీజేపీ రెడీ అవుతోంది.