దారుణం: ఏసీలో మంటలు..రాజకీయ నేత సహా ముగ్గురు మ‌ృతి

షార్ట్ సర్క్యూట్ కారణంగా గదిలోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు వ్యాపించి అధికార పార్టీ నేత సహా ముగ్గురు చనిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జిల్లాలోని

దారుణం: ఏసీలో మంటలు..రాజకీయ నేత సహా ముగ్గురు మ‌ృతి
Follow us

|

Updated on: May 30, 2020 | 12:29 PM

షార్ట్ సర్క్యూట్ కారణంగా గదిలోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు వ్యాపించి అధికార పార్టీ నేత సహా ముగ్గురు చనిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బరంపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో అధికార బీజేడీ నేత అలేఖ్ చౌదరి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గదిని చుట్టుముట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన చౌదరి.. కుటుంబ సభ్యులను నిద్రలేపి బయటకు పంపించివేశారు. అనంతరం అదే గదిలో నిద్రపోతున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లారు. వారిని కాపాడటానికి వెళ్లిన ఆయన ఊపిరి ఆడక గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. చౌదరి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. మంటలను అదుపు చేసి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, అప్పటికే వారు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అలేఖ్ చౌదరి మరణ వార్త తెలియడంతో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన మృతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.