మోదీ అభయం.. నితీష్ కుమార్ హర్షామోదం
నవంబరులో జరిగే ఛాత్ పూజ వరకు దేశంలోని పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో..
నవంబరులో జరిగే ఛాత్ పూజ వరకు దేశంలోని పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల బిహార్ సీఎం నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని హామీ పాలక ఎన్డీయే విజయావకాశాలను పెంచుతుందని ఆయన అన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో అయిదు నెలలపాటు ఫ్రీ రేషన్ ఇస్తామన్న మోదీకి కృతజ్ఞతలని ఆయన ట్వీట్ చేశారు. ఈ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ.. కేంద్రం ఇప్పటికే 5,057 కోట్ల విలువైన ఆహార ధాన్యాలను పంపిణీ చేసిందన్నారు. రాష్ట్రంలోని వలస కార్మికులకు ప్రధాని ప్రకటన వరమని ఆయన అభివర్ణించారు. .బిహార్ లో ఛాత్ పూజ అతి పెద్ద పండుగ అని, మోదీ ఇఛ్చిన హామీతో వారు సంతోషంగా ఈ పండుగ జరుపుకోగలరని సుశీల్ మోడీ పేర్కొన్నారు.
కాగా- మోదీ ప్రత్యేకంగా ఈ ఛాత్ పూజ గురించి ప్రస్తావించడం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేఅని, కానీ రాష్ట్రంలోని ఇతర సమస్యలను తాము ప్రస్తావించి.. ఎన్నికల్లో తమ విజయావకాశాల మెరుగుదలకు వ్యూహాలు పన్నుతామని విపక్షాలు అంటున్నాయి. వలస కార్మికులను ఆదుకునేందుకు తాము కూడా యత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.