‘మహా’లో కమల వికాసం.. ‘అందనిద్రాక్ష’గా హర్యానా !

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్-మై ఇండియా, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ వంటి మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ గురువారం నాటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. కాకపోతే సహజంగానే కొన్ని చోట్ల కాస్త ‘ తడబడినట్టు ‘ కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు కంప్లీట్ స్వీప్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రంలో 288 సీట్లకు […]

'మహా'లో కమల వికాసం.. 'అందనిద్రాక్ష'గా హర్యానా !
Follow us

|

Updated on: Oct 24, 2019 | 1:47 PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇండియా టుడే-యాక్సిస్-మై ఇండియా, న్యూస్-18, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ వంటి మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ గురువారం నాటి ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి. కాకపోతే సహజంగానే కొన్ని చోట్ల కాస్త ‘ తడబడినట్టు ‘ కనిపిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. దాదాపు కంప్లీట్ స్వీప్ అన్నా ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రంలో 288 సీట్లకు గాను బీజేపీ-శివసేన కూటమిదే పైచేయి అవుతుందని, ఈ కూటమికి 230 సీట్లు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48 స్థానాలు లభిస్తాయని టైమ్స్ నౌ ‘ ప్రిడిక్ట్ చేసింది. న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ-శివసేన అలయెన్స్ 243 సీట్లను, , కాంగ్రెస్-ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకుంటాయని ‘ అంచనా. అలాగే.. కాషాయ కూటమికి 166 నుంచి 194 వరకు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 72 నుంచి 90 స్థానాలు లభిస్తాయని ఇండియా-టుడే-యాక్సిస్ మై జోస్యం చెప్పింది. హర్యానాలో 90 సీట్లకు గాను బీజేపీ 69, కాంగ్రెస్ కేవలం 11 స్థానాలను గెలుచుకుంటాయని ని ఇదే మీడియా అంచనా వేసింది.

అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దిగజారిపోతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే పేర్కొంది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఈ రాష్ట్రంలో బీజేపీ 72 సీట్లను కైవసం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మరీ ఘోరంగా 8 సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. కాగా-ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు ఈ కూటమికి లాభించింది. ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టేందుకు శివసేన వెనుకాడినా.. కమలం పార్టీ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా.. పలుమార్లు ముంబై వఛ్చి ఈ పార్టీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా ఇరు పార్టీలకూ ‘ భారీ ప్రయోజనమే ‘ అవుతుందని నమ్మబలికారు. ఆయన జోస్యమే నిజమైంది. శివసేన అధినేత ఆదిత్య థాక్రే కూడా అమిత్ షా వ్యూహాన్ని సమర్థించారు. రెండు పార్టీల మేనిఫెస్టోలూ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. దాదాపు ఒకే విధమైన అభిప్రాయాలను ప్రతిబింబించాయి . ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా మోదీ ప్రభుత్వానికి ‘ జై ‘ కొట్టారు. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోదీతో.. వారంతా సెల్ఫీలు దిగిన వైనమే ఇందుకు సాక్ష్యం. నటీనటులే కాదు..దర్శక నిర్మాతలూ వీరిలో ఉన్నారు.

దేశానికి మోదీ నాయకత్వం ఎంతో అవసరమని వారంతా ముక్తకంఠంతో ‘ నినదించారు ‘. ప్రధాని మోడీ పూణే వంటి నగరాల్లో జరిపిన ప్రచారాల్లో.. కాంగ్రెస్ ‘ బలహీనతను ‘ బాగా ఎండగట్టారు. ఈ దేశ ప్రయోజనాలను బీజేపీ మాత్రమే పరిరక్షించగలదన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసినందువల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.కాగా- ఈ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అసలు కాంగ్రెస్ ప్రభావమే కనిపించలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్-ఎన్సీపీ తమ ఓట్లశాతాన్ని పెంచుకోగలిగాయి. బీజేపీ సీట్లు కొన్నింటిలో ఈ కూటమి అభ్యర్థుల జోరు కనిపించింది. కమలం పార్టీకి పట్టు ఉందని భావించిన స్థానాల్లో వీరి హవా కాస్త కనబడడమే ఇందుకు కారణం. హర్యానా విషయానికే వస్తే… ఈ రాష్ట్రంలో ఖట్టర్ ప్రభుత్వం మైనారిటీల ఓట్లనూ కొల్లగొట్టగలిగింది.

రాష్ట్ర అభివృధ్దిలో మీరూ భాగస్వాములేనని, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మీరు కూడా ‘ కమల వికాసానికి ‘ దోహదపడాలని మనోహర్ లాల్ ఖట్టర్ పదేపదే చెబుతూ వచ్చారు. ఇక ప్రధాని మోదీ సైతం ఈ రాష్ట్రానికి, పంజాబ్ కు మధ్య నదీజలాల వివాద పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని ఇఛ్చిన హామీ కూడా తన ప్రభావం చూపింది. సట్లెజ్ నదీ జలాల విషయంలో ఈ రాష్ట్రాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతూ వస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్న వాగ్దానం కూడా హర్యానాలో ఈ పార్టీకి కలిసొచ్చింది.

హంగ్ దిశగా హర్యానా.. తాజా ఫలితాల ప్రకారం.. హర్యానాలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లకు గాను బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ 32 స్థానాల్లో, ఐ ఎన్ ఎల్ డీ +2, జేజేపీ 10 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర వహించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిచేందుకు స్ఫష్టమైన ఛాన్స్ ఉంది. కానీ.. తీరు చూస్తే ఈ అంచనాలు తారుమారు కావడం కొసమెరుపు.