సచిన్ పైలట్ వర్గానికి రాజస్తాన్ హైకోర్టు ఊరట
రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం, అసమ్మతి నేత సచిన్ పైలట్ కి, ఆయన వెంట ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు రాజస్తాన్ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరి అనర్హతకు సంబంధించి ఎలాంటి చర్యా తీసుకోకుండా ఈ నెల 24 వరకు వాయిదా వేయాలని..
రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం, అసమ్మతి నేత సచిన్ పైలట్ కి, ఆయన వెంట ఉన్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు రాజస్తాన్ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరి అనర్హతకు సంబంధించి ఎలాంటి చర్యా తీసుకోకుండా ఈ నెల 24 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ని ఆదేశించింది. శుక్రవారం వరకు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తమను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ సీపీ జోషీ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ.. సచిన్, ఈ ఎమ్మెల్యేలు ఈ నెల 17 న రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాష్ గుప్తాలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించింది. రెండు రోజులపాటు దీనిపై కోర్టులో వాద, ప్రతివాదనలు జరిగాయి.
ఈ నెల 13, 14 తేదీలలో జరిగే సీఎల్ఫీ సమావేశాలకు హాజరు కావాలన్న విప్ ను వీరు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వీరికి నోటీసులు జారీ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశమైనప్పుడే విప్ చెల్లుతుందని రెబెల్ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ ఈ వారంలో శాసన సభలో బల పరీక్షను ఎదుర్కొనవచ్చునని వార్తలు వస్తున్న వేళ..కోర్టు నిర్ణయం దానిపై ప్రభావం చూపవచ్చు. అసెంబ్లీని సమావేశపరచాలని గెహ్లాట్ ఇదివరకే గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరారు. అటు గెహ్లాట్ మంగళవారం తన కేబినెట్ సహచరులతో సమావేశమయ్యారు. సచిన్ పైలట్ ని డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన తరువాత జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశమిది.
రెబెల్ ఎమ్మెల్యేలను సభలో ఓటు చేసేందుకు కోర్టు అనుమతించిన పక్షంలో గెహ్లాట్ సర్కార్ ఇబ్బందుల్లో పడుతుంది. అయితే కోర్టు ఉత్తర్వులు వారికి వ్యతిరేకంగా వస్తే,, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ముప్పు ఉండబోదని అంటున్నారు.