బీజేపీ కౌన్సిలర్ హత్యకు నిరసనగా ఆందోళన
బెంగాల్ రణరంగంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు నిరసనగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. కోల్కతాలో బీజేపీ చేపట్టిన నబన్నా ఛలో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కమలనాథులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...
Nabanna Chalo : బెంగాల్ రణరంగంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు నిరసనగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. కోల్కతాలో బీజేపీ చేపట్టిన నబన్నా ఛలో కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో కమలనాథులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హౌరా బ్రిడ్జిని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు బారికేడ్స్ను తొలగించి ముందుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్రగాయం కావడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయింది.
సుమారు రెండు గంటలసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపుచేసేందుకు ఆందోళనకారులపైకి టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు పోలీసులు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి కౌన్సిలర్ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ నబన్నా ఛలో పిలుపుతో భద్రతను కట్టుదిట్టం పోలీసులు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. అయితే బారికేడ్లను కూడా తొలగించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నాలుగు రోజుల క్రితం బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లాను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. బరాక్పూర్ టిటాగఢ్లో పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కారు దిగుతుండగా బైక్పై వెంబడించిన ఇద్దరు దుండగులు.. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీష్ శుక్లా స్పాట్లోనే చనిపోయారు. పోస్ట్మార్టం అనంతరం ఈ కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది. ఇక ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కమలదళం.. దోషులను కఠినంగా శిక్షించాలని నిరసనకు దిగారు. మమతా బెనర్జీ సర్కార్పై మండిపడ్డారు.