రెండో టెస్టులో ఎవరు ఔట్.. ఎవరు ఇన్..టీమిండియా జట్టులో భారీ మార్పులు తప్పదంటున్న విశ్లేషకులు
రెండో టెస్టు కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచిన షా, సాహా స్థానాల్లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా...
Boxing Day Test : రెండో టెస్టు కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచిన షా, సాహా స్థానాల్లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసిన కోహ్లీ సేన రెండో టెస్టులో తమ సత్త చూపించాలనే టార్గెట్ ముందుకు కదులుతోంది.
ఇకపై సారథి కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం, గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్కు దూరం కావడంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. తొలి టెస్టులో దారుణంగా ఆడి తీవ్ర విమర్శలు మూటకట్టుకున్న ఓపెనర్ పృథ్వీషాతోపాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సాహా స్థానంలో రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. పృథ్వీ షా ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో అతడి స్థానంలో శుభ్మన్ గిల్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక, కోహ్లీ స్థానాన్ని కేఎల్ రాహుల్తో భర్తీ చేయనున్నారు.తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమీ స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ కనుక మూడో టెస్టు నాటికి క్వారంటైన్ ముగించుకుని అందుబాటులోకి వస్తే జట్టులో మళ్లీ మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయి.