అసోం డీజీపీకి కరోనా పాజటివ్..!
రోజు రోజుకి కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా కరాళనృత్యానికి దేశం విలవిలలాడుతోంది. నిత్యం పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా కరోనా వైరస్ ధాటికి గురవుతున్నారు. రోజు రోజుకి కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇక డీజీపీతో సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు అసోం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు 30 మంది కొవిడ్-19 బారిన పడ్డారని పోలీసు అధికారి వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐజీపీ (లా అండ్ ఆర్డర్), డీఐజీ (అడ్మినిస్ట్రేషన్) తదితరులు కూడా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,259 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడినట్టు అసోం అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) జీపీ సింగ్ వెల్లడించారు. వీరిలో 1,734 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇక ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని సింగ్ తెలిపారు. మరోవైపు అసోంలో ఇప్పటి వరకు 58,837 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.