వేట మొదలైంది.. పులి రావడమే ఆలస్యం.. బెబ్బులిని బంధించేందుకు రెడీ అంటున్న ఫారెస్ట్ అధికారులు
మ్యాన్ ఈటర్ కోసం వేట మొదలైంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. భీమన్నపేట అటవీప్రాంతంలో ఎరగా..
A-2 Tiger : మ్యాన్ ఈటర్ కోసం వేట మొదలైంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. భీమన్నపేట అటవీప్రాంతంలో ఎరగా వేసిన ఓ పశువును ఈ పెద్దపులి సోమవారం చంపేసింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా రెండోసారి మళ్లీ వస్తుంది. దీంతో కంది భీమన్న అటవీప్రాంతంలోని సంఘటన స్థలానికి పక్కనే అటవీశాఖ ఓ మంచె ఏర్పాటుచేసింది. అక్కడికి పులి రాగానే మత్తు ఇంజక్షన్తో బంధించేందుకు ప్రణాళిక రచించింది.
ఆకలి తీర్చుకునేందుకు కొద్దిరోజులుగా ఈ పెద్దపులి పశువుల్ని చంపుతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు కొన్నిచోట్ల పశువుల్ని కట్టేసి ఎరగా ఉంచి పద్మవ్యూహం పన్నారు. ఇందులో చిక్కిన ఏ-2 పెద్దపులి రెండ్రోజుల క్రితం కంది భీమన్న అటవీప్రాంతంలో ఎరగా ఉంచిన పశువుని చంపింది. ఇప్పుడు ఆ ప్రదేశానికి 20-30 మీటర్ల దూరంలోనే ఓ మంచె ఏర్పాటుచేశారు. ఇద్దరు పశువైద్యులతో పాటు ఒకరిద్దరు అటవీ అధికారులు మంగళవారం నుంచే ఆ మంచెపైకి ఎక్కి పులి కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సమీపంలో ఓ క్యాంప్, 10 కి.మీ. దూరంలో బెజ్జూరులో మరో క్యాంప్ ఏర్పాటుచేశారు. ఫారెస్ట్ కన్జర్వేటర్ వినోద్కుమార్, స్థానిక డీఎఫ్ఓ శాంతారాంతో పాటు తెలంగాణ అటవీశాఖ అధికారులు, 40 మంది సిబ్బంది పెద్దపులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్కు సహకరించేందుకు మహారాష్ట్ర నుంచి 8 మంది అధికారులు వచ్చారు. మత్తు ఇంజక్షన్కు పులి చిక్కితే తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని రప్పించారు.
దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎటువైపు నుంచి బెబ్బులి తమపై దాడి చేస్తుందోనని.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల దూరం నుంచే అధికారులు ఆంక్షలు విధించారు. స్థానిక గ్రామాల ప్రజలు సమీపంలోని అడవిలోకి రాకపోకలను నిలివేశారు. అనుకున్నట్లుగా ఏ-2 పులి పట్టుబడితే హైదరాబాద్ జూకి తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పొలం పనులకు వెళ్లే గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. మ్యాన్ ఈటర్ దాడితో అలెర్ట్ అయిన ఫారెస్టు సిబ్బంది.. బెజ్జూరులో మరో క్యాంప్ ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు మొత్తం 40 మంది అధికారులు రంగంలోకి దిగారు. బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
కోడి పందేలకు సై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు.. బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు