GHMC Elections: ఆయనొక్కరే ఆపని చేయగలరు.. ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎంఐఎం 44 సీట్లు గెలుచుకోవడం..
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎంఐఎం 44 సీట్లు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్పై, బీజేపీ ఎదుగుదలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను చాలా బలమైన నేతగా అభివర్ణించారు. అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని, బీజేపీని ఎదుర్కొనగలిగే సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన మంచి పాలన సాగిస్తున్నారని ప్రశంసించిన ఒవైసీ.. కొన్ని సీట్లు పోయినంత మాత్రాన రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండదని జోస్యం చెప్పారు. బీజేపీని తెలంగాణ ప్రజానికం తప్పక అడ్డుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో మేయర్ పదవికి మద్దుతుపైనా అసదుద్దీన్ స్పందించారు. తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ 44 సీట్లను నిలబెట్టుకున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మద్దతు అంశంపై నేడు నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ ప్రకటించారు. దీనికి సంబంధించి పార్టీ నేతలతో చర్చిస్తామన్నారు. కాగా, 51 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 చోట్ల విజయకేతనం ఎగురువేసిన విషయం తెలిసిందే. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు, బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎక్కేదెవరు అనేదానిపై సందిగ్ధత నెలకొంది.