RIP Arun Jaitley: న్యాయవాది నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. అంచెలంచెలుగా అరుణ్ జైట్లీ
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2018లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి అస్వస్థులయ్యారు. దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగింది. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు. అనారోగ్యం […]
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2018లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి అస్వస్థులయ్యారు. దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగింది. 2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు. అనారోగ్యం కారణంగానే తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.
అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం..
అరుణ్ జైట్లీ.. న్యాయవాది నుంచి రాజకీయ నాయకుడిగా మారిన నేత. దేశ రాజధాని నుంచి ప్రారంభమైన అరుణ్ జైట్లీ రాజకీయ ప్రస్థానం.. కేంద్ర మంత్రి స్థాయికి వరకు ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతుండగా ఏబీవీపీ నేతగా ఎదిగారు. ఎమెర్జెన్సీ నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. తొలుత సుప్రీం కోర్టు లాయర్గా అనేక మల్టీ నేషనల్ కంపెనీల కోసం వాదించారు. ఎమెర్జెన్సీలో జైలుకెళ్ళిన జైట్లీ.. బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. వాజ్పేయి ప్రభుత్వంలోను, మోదీ తొలి ప్రభుత్వంలోనూ అనేక శాఖల్ని నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాలతో మోదీ మలి ప్రభుత్వంలో పదవులకు దూరంగా ఉన్నారు.
ఏబీవీపీ నేతగా.. సుప్రీం కోర్టు లాయర్గా..
67 సంవత్సరాల అరుణజైట్లీ అటు సుప్రీం కోర్టులో లాయర్గా.. ఇటు రాజకీయాల్లోనూ అనేక కీలక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. దివంగత వాజపేయ్ ప్రభుత్వంలోను.. నరేంద్ర మోదీ తొలి సర్కార్లోనూ రక్షణ, ఆర్థిక, కార్పొరేట్ వంటి ముఖ్యమైన శాఖలెన్నో జైట్లీ నిర్వహించారు. ఢిల్లీలోని సెయింట్ జేవియర్ స్కూల్లో చదువుకున్న జైట్లీ… ఢిల్లీ యూనివర్శిటీలో లా చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో ఉండగానే అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నేతగా ఎదిగారు. 1974లో యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేశారు. ఎమెర్జెన్సీ కాలంలో 19 నెలల పాటు పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించారాయన. తర్వాత బీజేపీ ఢిల్లీ శాఖ కార్యదర్శిగా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు అరుణ్జైట్లీ.
వాజ్పేయ్ హయాంలో..
ఢిల్లీ హైకోర్టులో, సుప్రీం కోర్టులోనూ సీనియర్ న్యాయవాదిగా అనేక కేసులు వాదించారు. వీపీ సింగ్ ప్రభుత్వం హయాంలో బోఫోర్స్ కేసులో పేపర్ వర్క్ కూడా చేశారు. సుప్రీం కోర్టు లాయర్గా పెప్సీ కో.. కోకో కోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీల కోసం కేసులు వాదించారు. 1991 నుంచి బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1999లో ఏర్పడిన వాజ్పేయ్ ప్రభుత్వంలో సమాచారశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ యుగం మొదలయ్యాక దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పర్వం ప్రారంభమైంది. అప్పుడు దీని కోసం వాజ్పేయ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖను జైట్లీకి అప్పగించారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా..
యూపీఏ హయాంలో తిరిగి బీజేపీ ప్రధానకార్యదర్శిగాను…రాజ్యసభలో ప్రతిపక్ష నేతగానూ బాధ్యతలు నిర్వహించారు జైట్లీ. పంజాబ్కు చెందిన అరుణ్జైట్లీ ఒకసారి గుజరాత్ నుంచి 2018 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు ఆర్థిక శాఖ నిర్వహించిన జైట్లీకి తర్వాత రక్షణ శాఖ కూడా అప్పగించారు. జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నపుడే 2016 నవంబర్ 9న నోట్ల రద్దు జరిగింది. జీఎస్టీ పేరుతో వస్తు సేవల పన్ను కూడా జైట్లీ హయాంలోనే దేశంలో ప్రారంభమైంది.