నవంబరు 28న ఆర్జీయూకేటీ సెట్… ఏపీలో 629, తెలంగాణలో 8 సెంటర్లు..
ఈ పరీక్ష కోసం 637 సెంటర్లు ఇందులో ఆంధ్రప్రదేశ్లో 629, తెలంగాణలో 8 ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 100మంది అభ్యర్థులు నమోదైన ప్రతి మండలంలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
Common Entrance Test : రాజీవ్గాంధీ వర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(RGUKT CET)కు మొత్తం 88,961 దరఖాస్తులు వచ్చాయని వర్శిటీ అధికారులు తెలిపారు. నవంబరు 28న ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. నూజివీడు, ఆర్.కె.వ్యాలి, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ఆరేళ్ల సమీకృత విద్యతో కూడిన బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి ఈ సెట్ నిర్వహించనున్నారు.
గతనెల 22న నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీ నుంచి 86,617మంది, తెలంగాణ నుంచి 2,344మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కడప జిల్లాలో అత్యధికంగా 9,440మంది, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 4,182 మంది ఉన్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 520 మంది, అత్యల్పంగా మహబూబ్నగర్ నుంచి 156మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పరీక్ష కోసం 637 సెంటర్లు ఇందులో ఆంధ్రప్రదేశ్లో 629, తెలంగాణలో 8 ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 100మంది అభ్యర్థులు నమోదైన ప్రతి మండలంలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అంతకంటే తక్కువగా ఉంటే సమీపంలోని సెంటర్కు వారిని కేటాయించనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.