సీఎస్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల విధులకు మూడు విజ్ఞప్తులను సీఎస్ ముందుంచిన ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీ వర్సెస్ ఉద్యోగులుగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరపాలంటూ..
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీ వర్సెస్ ఉద్యోగులుగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సై అన్న వేళ… సీఎస్తో భేటీ అయ్యారు ఉద్యోగులు. తాము కూడా ఎన్నికల విధులకు సిద్ధమేనని, కానీ మూడు విజ్ఞప్తులను పట్టించుకోవాలని కోరుతున్నారు.
50 ఏళ్లు దాటిన మహిళా ఉద్యోగులను పోలింగ్, కౌటింగ్ విధులకు దూరంగా ఉంచాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని మినహాయించాలని, ఎన్నికల విధుల్లో ఎవరికైనా కరోనా వచ్చి మరణిస్తే 50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.
ఎన్నికల సంఘమే తమను వివాదంలోకి లాగిందని, ప్రభుత్వ ఉద్యోగులతో వైరం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఈసీతో తామెప్పుడూ విభేదించలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎక్కడా చెప్పలేదని, ఉద్యోగులను ఇబ్బందిపెట్టవద్దని మాత్రమే కోరామని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.