అమరావతిలో వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు, గతంలో మాన్సస్ రద్దు చేయమన్న వ్యక్తి అశోక్: బొత్స

అమరావతిలో వందల వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ...

అమరావతిలో వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు, గతంలో మాన్సస్ రద్దు చేయమన్న వ్యక్తి అశోక్: బొత్స
Follow us

|

Updated on: Jan 13, 2021 | 6:18 PM

అమరావతిలో వందల వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజల ఆలోచనకు భిన్నంగా చంద్రబాబు ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు ఎందుకు ఓడించారో ఆయనకి ఇప్పటికీ తెలియటం లేదని బొత్స అన్నారు. “వ్యవసాయం దండగన్న చంద్రబాబు, ఇప్పుడు రైతుల కోసం మాట్లాడుతున్నాడు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వటం నాకేమి పని అన్న వ్యక్తి చంద్రబాబు. నీ కొడుకుకు తప్ప ఎవరికి ఉద్యోగ అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు అవినీతి దోపిడీ కోసమే పోలవరం, అమరావతి.” అని బొత్స విమర్శలు గుప్పించారు. అంతేకాదు, అమరావతి, పోలవరం లను చంద్రబాబు తన హయాంలో ఏటీఎం కార్డులుగా వాడుకున్నారని విమర్శించారు బొత్స. ” పేదలకు పట్టాలిచ్చిన చరిత్ర చంద్రబాబుకు ఎప్పుడైనా ఉందా.? చంద్రబాబుకు ఓడిపోయానన్న పశ్చాత్తాపం కనీసం కనిపించటం లేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఎందుకు అంత ఆక్రోశం.? రాష్ట్ర అప్పు పెరిగింది.. అభివృద్ధి కోసం తప్ప, అవినీతి కోసం కాదు. గాలి మాస్టర్ గాలి పై మాట్లాడక ఏమి చెప్తాడు? అంటూ ఆరోపించారు బొత్స.

విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స మాన్సస్ ట్రస్ట్ వ్యవహారాల మీదా స్పందించారు. పారదర్శకత కోసమే నూతన మున్సిపల్ ట్యాక్స్ విధానమని బొత్స అన్నారు. “చంద్రబాబుకి మాన్సస్ చరిత్ర తెలుసా.? చరిత్ర తెలియకుండా చంద్రబాబు ఏమి మాట్లాడతాడు.? తెలివితేటలు ఎక్కువగా ఉన్న అశోక్ కుటుంబం మేధావితనం వల్లే మాన్సస్ ఏర్పడింది. 2004 కు ముందు మాన్సస్ ట్రస్ట్ ను రద్దుచేసి ప్రభుత్వంలో కలపాలని అశోక్ గజపతి ప్రభుత్వంకు లేఖ రాశారు. ఆనంద గజపతి చైర్మన్ గా ఉండటం ఇష్ట లేక మాన్సస్ రద్దు కోసం ఆయన తమ్ముడు అశోక్ లేఖ రాశాడు. మాన్సస్ ను ప్రభుత్వంలో కలపవద్దని ఆనంద్ రిక్వెస్ట్ మేరకు ట్రస్ట్ కి ఆనంద్ గజపతిని చైర్మన్ గా కొనసాగించాము.” అని బొత్స చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన బొత్స, ఏదో ఒక జిల్లాలో స్థానిక సంస్థలలో మేము ఇంత పర్సటేజ్ గెలుస్తామని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? అంటూ విపక్షాలను ఛాలెంజ్ చేశారు బొత్స.