ఏపీలో ఎటూ తేలని ‘పంచాయితీ’.. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు.. రాష్ట్రస్థాయి సమావేశానికి అధికారుల గైర్హాజరు
ఎన్నికల నిర్వహణను ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎపీ సర్కార్ మధ్య అజ్యం పోశాయి. ఎన్నికల నిర్వహణను ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అదే ఇప్పుడు హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నికలు జరిపి తీరుతామని ఎస్ఈసీ పట్టుపడుతోంది. మేం వద్దన్నా మీరు ఎన్నికలు పెడతారా? అన్నది ప్రభుత్వ అభ్యంతరం.
సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించేలా ఏపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య నడుస్తున్న పంచాయతీ క్లైమాక్స్కు చేరినట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం వద్దన్నా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పంచాయతీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీని ప్రకారం 25వ తేదీ నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైపోతుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ రమేష్కుమార్. ఏం జరిగినా బాధ్యత మొత్తం ప్రభుత్వానిదేనని, మూల్యం చెల్లించుకోవాలని కామెంట్ చేశారు.
అయితే ఎస్ఈసీ ఈ వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వం వైపు నుంచి, ఉద్యోగాల సంఘాల నుంచి సీరియస్ రియాక్షన్సే వచ్చాయి. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోరని స్వయంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ప్రకటించారు. మరోవైపు, అవసరమైతే ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు ఉద్యోగ సంఘాల నేతలు.
నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష కోసం పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ మరో వివాదాన్ని రాజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, జిల్లాల కలెక్టర్లు ఎవరూ హాజరుకాలేదు. రెండు గంటలసేపు వీడియో కాన్ఫరెన్స్లో ఒక్కరే ఉండిపోయారు నిమ్మగడ్డ. ఈ పరిణామంతో అధికారుల సహకారం లేకుండా ఎన్నికలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తి రేపుతోంది.
మరోవైపు, నామినేషన్లను స్వీకరించే దగ్గరి నుంచి… ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన వరకు పని చేయాల్సింది మండల స్థాయి అధికారులే. సీఎస్సే ఎన్నికలు వద్దంటున్నప్పుడు ఇక మండల, గ్రామ స్థాయి అధికారులు ఎంత వరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఇది ముందే ఊహించారో ఏమో కానీ… ప్రెస్మీట్లోనే ఈ పరిస్థితికి పరిష్కారం ఏంటన్నది కూడా క్లారిటీ ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్కుమార్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K ప్రకారం… ఎస్ఈసీకి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్కు ఉంటుందని, దాన్ని ఇప్పటికే హరిచందన్కు వివరించానని నిమ్మగడ్డ చెప్పారు.
అధికారులు రమ్మంటే రాలేదు, వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు నిమ్మగడ్డ ముందున్న ఆప్షన్ గవర్నర్, లేదంటే హైకోర్టు. ముందు గవర్నర్ దగ్గరకే వెళ్లి… ప్రభుత్వాన్ని ఆదేశించేలా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను హైకోర్టుకు వివరించి ఒక డైరెక్షన్ ఇప్పించే ఛాన్స్ కూడా ఉంది. ముందు గవర్నర్ దగ్గరకు వెళితే… ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.