ఏపీలో పెరుగుతున్న కోలుకుంటున్నవారి సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,190 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో పెరుగుతున్న కోలుకుంటున్నవారి సంఖ్య
Follow us

|

Updated on: Sep 29, 2020 | 7:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా అత్యధిక కేసులు నమోదైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వల్పంగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 68,429 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 6,87,351కు చేరుకున్నాయి.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కరోనా బారిన పడి 37 మంది ప్రాణాలను కోల్పోగా.. మంగళవారం ఆ సంఖ్య 35గా నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,780కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరులో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అటు, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మంగళవారం 9,836 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,87,351 పాజిటివ్ కేసులకు గాను, 6,22,136 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 59,435 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.