తిరుమలకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వచ్చారు.. తిరుమలలో జరుగుతున్న దేవ దేవుడి శ్రీవెంటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్పెరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి జగన్ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
కాసేపట్లో 5.30 గంటలకు అన్నమయ్య భవన్ లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫెరెన్స్ లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం 7 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. శ్రీవారి దర్శనానంతరం 7.30 గంటలకు నిర్వహించే గరుడవాహనసేవలో సీఎం జగన్ పాల్గొనననున్నారు. కాగా, ఈ రాత్రి సీఎం తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అటు సీఎం జగన్ రాకపై రాజకీయ నేత అభ్యంతరాల నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సీఎం జగన్ తో రమణ దీక్షితులు భేటీ
మరోవైపు, పద్మావతి అతిథిగృహంలో సీఎం వైఎస్ జగన్ తో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సమావేశమయ్యారు. పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్ లో ఉండటంతో సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కలిసి మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.