ఆ ప్రాజెక్టు కొత్తది కాదు..కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం జగన్

కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యుత్తరం పంపించారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని, రాష్ట్రం తరఫున..

ఆ ప్రాజెక్టు కొత్తది కాదు..కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం జగన్
Follow us

|

Updated on: Aug 11, 2020 | 8:48 PM

కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యుత్తరం పంపించారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని, రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించి ఏపీ నుంచి స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని జగన్‌ లేఖలో పేర్కొన్నారు .

‘‘కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కావు. కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయి. 2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది. కృష్ణానదీ నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు. నీటి నిల్వ సామర్థ్యం పెరగదు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతలు చేపట్టాం. రాయలసీమ ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్టు కాదని మనవి చేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి జగన్‌ లేఖలో వెల్లడించారు.

కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, దిండిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. రెండు ప్రాజెక్టులు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థ, ఆయకట్టును సృష్టిస్తున్నాయి. మొదట అపెక్స్‌ కౌన్సిల్‌లో నీటివాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పింది. అనంతరం ఈ నిర్మాణాలను చేపట్టింది. నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని భావించాం. ఆ సమావేశం జరగకుండా ఆగిపోయింది’’అని జగన్‌ లేఖలో పేర్కొన్నారు.