సీఎం జగన్ కీలక ఆదేశాలు.. 30 లక్షల కుటుంబాలకు గుడ్ న్యూస్..
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే దీనిపై తాజాగా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే దీనిపై తాజాగా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాల కల్లెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఇప్పటికే ఇళ్ళ స్థలాల కోసం 62 వేల ఎకరాలను సేకరించామని సీఎం తెలిపారు. ప్రైవేటు భూముల కొనుగోలుకు సుమారు రూ.7500 కోట్లు ఖర్చు చేశామన్న ఆయన.. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో పేదలకు 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని సీఎం జగన్ స్పష్టం చేశారు. అవి కూడా సగంలోనే ఆపేశారని మండిపడ్డారు. అందులోనూ రూ.1300 కోట్లు బకాయిలు పెట్టారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లను కట్టించాల్సిన ప్రభుత్వం.. ఇంత దారుణంగా వ్యవహరించిందని విమర్శించారు.
కానీ, ఇవాళ ఏపీలోని 20 శాతం మంది జనాభాకు ఇస్తున్నామని 30 లక్షల మంది పేద ప్రజల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్నారు. ఇవన్నీ కూడా ఇళ్లపట్టాలు ఇచ్చిన నెలరోజులకే ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్న ఆయన.. లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలను కలెక్టర్లు చేపట్టాలని అన్నారు. పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ప్లాట్ నెంబర్, హద్దులు పేర్కొనడం వంటి వాటిపై దృష్టి సారించాలని… ఈ టైం గ్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగష్టు 15న చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.