సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో తన మార్క్ చూపిస్తున్నారు సీఎం జగన్. తాజాగా మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో తన మార్క్ చూపిస్తున్నారు సీఎం జగన్. తాజాగా మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఫ్రీగా బోర్లు తవ్వించేందుకు తలపెట్టిన ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరూ ఆన్లైన్లో గాని, గ్రామ సచివాలయాల్లో గాని దరఖాస్తు చేసుకోవాలని సమాచార కమిషనర్ విజయ్కుమార్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు .
ఈ పథకంలో భాగంగా హైడ్రలాజికల్, జియోఫిజికల్ సర్వేల ఆధారంగా ఆయా ప్రదేశాల్లో బోర్ల తవ్వకం చేపడతారని కమిషనర్ విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హుల జాబితా ఫైనల్ చేస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా వారికి తెలియజేస్తామన్నారు. అలాగే బోర్లు తవ్వే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసిన తర్వాతే డబ్బు చెల్లింపులు చేస్తామని విజయ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 28న ముఖ్యమంత్రి జగన్ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?