వాడీవేడీగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. నేడు ఉభయ సభల్లో చర్చకు రానున్న 11 రకాల అంశాలు..
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రోజు సభలో వాడి వేడిగా చర్చలు జరిగాయి.
AP Assembly Winter Meetings: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రోజు సభలో వాడి వేడిగా చర్చలు జరిగాయి. పలు అంశాలపై అధికార, విపక్షాల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్నారని 12 మంది టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ విధించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు తమపై దాడి చేశారని మార్షల్స్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అయితే నేడు ఉభయ సభల్లో కీలక బిల్లులు, వివిధ అంశాలపై చర్చ జరగనుంది. దాదాపుగా అసెంబ్లీలో11 బిల్లులు, మండలిలో ఐదు బిల్లులు చర్చకు వస్తాయి. పోలవరం, బీసీ సంక్షేమ కార్పోరేషన్ల ఏర్పాటు, కరోనా కట్టడి, దిశా, వ్యవసాయ మండలి, ఏపీఎస్డీసీకి చట్టబద్దత, ఎఫ్ఆర్బిఎం, ఇంధన చట్ట సవరణ తదితర బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అలాగే కరోనా కట్టడి, ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతలు, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్, ఆక్వా సీడ్, ఫిషరీస్ యూనివర్శిటీ, ఏపీ గేమింగ్ సవరణ తదితర బిల్లులపై శాసన మండలిలో చర్చ జరుగుతుంది.