ఏపీ అసెంబ్లీలో 4వ రోజు అదే సీన్.. 8 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్..సభలో తీవ్ర గందరగోళం.. హాట్హాట్గా సాగిన చర్చ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఏపీ అసెంబ్లీలో 4వ రోజు అదే సీన్. వరుసగా నాలుగో రోజూ ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. సంక్షేమంపై చర్చ పక్కదారి పట్టింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సందర్భంలోనే నిమ్మల రామానాయుడు సీఎం జగన్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన వైపు దూసుకెళ్లారు అధికార పక్ష సభ్యులు.
ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత మళ్లీ సంక్షేమంపై చర్చ కొనసాగింది. తమకు పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం పైకి ఎక్కి ఆందోళన చేశారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా వాళ్లు వెనక్కి వెళ్లలేదు. దీంతో 8 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ మంత్రి పేర్ని నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్ ఆమోదించారు. తమ సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ చంద్రబాబుతోపాటు మిగిలిన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.