పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాకు మరో షాక్.. రాజీనామా చేసిన మరో మంత్రి..!
ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో మంత్రి షాక్ ఇచ్చాడు. మంత్రి రాజీవ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రమంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
West Bengal Minister Rajib Banerjee Resigns : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో మంత్రి షాక్ ఇచ్చాడు. నిన్నటికి నిన్న పార్టీలో పదవుల పందేరాన్ని జరిపి, అందరినీ శాంత పరిచినా.. నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా మరో మంత్రి రాజీవ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రమంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.
బెంగాల్ రాష్ట్ర మంత్రి రాజీవ్ బెనర్జీ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపించారు. అయితే, తన రాజీనామాకు సంబంధించిన కారణాలను మాత్రం వెల్లడించలేదు. ‘‘అటవీ శాఖా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేను… నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలపడానికి తీవ్రంగా చింతిస్తున్నాను. ప్రజలకు సేవలందించినందుకు చాలా గర్విస్తున్నా. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నేను కొంత కాలంగా తీవ్రంగా బాధపడుతున్నా. మానసికంగా కూడా అలసిపోయా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం నన్ను తీవ్రంగానే బాధించింది. అయినా తప్పడం లేదు. ఇన్ని సంవత్సరాలు నాకు మార్గదర్శనం చేసిన సీఎం మమతకు ధన్యవాదాలు.’’ అంటూ రాజీవ్ తన లేఖలో పేర్కొన్నారు.
కాగా మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి ఆయన గైర్హాజర్ అయ్యారు. అప్పటి నుంచే ఆయన బీజేపీలో చేరిపోతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఈ విషయంపై మాత్రం రాజీవ్ బెనర్జీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అటు భారతీయ జనతా పార్టీ నేతలు బెంగాల్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలకు గాలం వేస్తూ.. కషాయం కండువా కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యనేతలు ఒక్కక్కొక్కరుగా బీజేపీలో చేరిపోతున్నారు.
Read Also… సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్పై సందిగ్ధత.. హౌస్ మోషన్ దాఖలు చేసే ప్రయత్నాల్లో ఏపీ సర్కార్