Covid ex-gratia: కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించే అంశంపై విజయసాయి ప్రశ్న.. కేంద్రం సమాధానం
కొవిడ్ మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించే అంశం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Covid ex-gratia: కొవిడ్ మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించే అంశం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇవాళ రాజ్యసభలో రాతపూర్వక సమాధానమిచ్చారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
గౌరవ్ కుమార్ బన్సాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఈ ఏడాది జూన్ 30న సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ కొవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ)ను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
కొవిడ్ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి క్వారంటైన్, కంటైన్మెంట్, శాంపిల్ కలెక్షన్, స్క్రీనింగ్, అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం ఎస్డీఆర్ఫ్ నిధుల వినియోగానికి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనుమతించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎక్స్ గ్రేషియా అంశానికి సంబంధించి సంప్రదింపుల అనంతరం దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.