Andhra Pradesh: కొండపల్లి ఇష్యూపై హైకోర్టులో విచారణ.. కేశినేని ఓటు హక్కుపై ఫైనల్ తీర్పు ఎప్పుడంటే?
కొండపల్లి ఇష్యూపై హైకోర్టులో విచారణ జరిగింది. కేశినేని ఓటు హక్కు వినియోగంపై ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తామని, విచారణను మూడు వారాలు వాయిదా వేస్తున్నట్లు హైకోర్ట్ ప్రకటించింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీ పాలక వర్గం ఎన్నికపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య వార్ కంటిన్యూ అవుతుంది. జనరల్ బాడీ ఎన్నికలో స్థానిక ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చివరకు ఈ వ్యవహారం కోర్టు మెట్లేక్కింది. కేశినేని నాని సహా కొండపల్లికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఓవైపు ఎంపీకి ఓటు హక్కు వేసే అర్హత లేదంటూ కొండపల్లికి చెందిన వైసీపీ కౌన్సిలర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
కేశినేని నాని ఓటు హక్కు వినియోగంపై సివిల్ కోర్టుకు వెళ్లాలంటూ వైసీపీ కౌన్సిలర్ల తరఫు న్యాయవాది వాదించగా.. ఆ తర్వాత కేశినేని పిల్కు హైకోర్టులో విచారణ అర్హత ఉందని ఆయన తరపున న్యాయవాది అశ్వని కుమార్ కోర్టుకు చెప్పారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు… కేశినేని నాని దాఖలు చేసిన పిల్కు హైకోర్టులో విచారణ అర్హత ఉందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కొండపల్లి నగర పంచాయతీ పాలకవర్గం ఎన్నికలో కేశినేని నాని ఓటు హక్కు వినియోగానికి సంబంధించి ఫైనల్ నిర్ణయాన్ని తామే ప్రకటిస్తామని చెప్పిన హైకోర్టు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.