Andhra Pradesh: ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు.. అంతే కాకుండా
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించింది. ఈమేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.
ఏపీలో అధికారం మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్ల మార్పు మొదలైంది. ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జగనన్న విద్యాదీవెనగా కొనసాగుతున్న పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం చంద్రన్న పెళ్లి కానుకగా మారింది. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఇకపై అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మారనుంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా కొనసాగనుంది. ఈ మేరకు ఏపీలో కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీ రాజముద్ర ఉన్న సర్టిఫికెట్లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. 2019-24 మధ్య వచ్చిన కొత్త పథకాల పేర్లు తొలగించాలని సూచించారు. కొత్త పేర్లు వచ్చేవరకు సాధారణ పేర్లు వాడాలని పేర్కొంది. ప్రభుత్వ వెబ్సైట్లో పార్టీ జెండా రంగులు తీసేయాలని ఆదేశించింది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో స్కీమ్స్ అమలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మళ్లీ పాత పేర్లనే తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.
జగన్ సర్కార్ హయాంలో పథకాలు పేర్లు — మార్పు చేసిన పథకాల పేర్లు
- జగనన్న విద్యాదీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
- వైఎస్ఆర్ కల్యాణమస్తు – చంద్రన్న పెళ్లి కానుక
- వైఎస్ఆర్ విద్యోన్నతి – ఎన్టీఆర్ విద్యోన్నతి
- జగనన్న విదేశీ విద్యా దీవెన- అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి
- జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం- సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..