YS Vijaya: ఏపీలో రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన వైఎస్ విజయ.. వాస్తవం ఇదంటూ బహిరంగ లేఖ..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సతీమణి..

YS Vijaya: ఏపీలో రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన వైఎస్ విజయ.. వాస్తవం ఇదంటూ బహిరంగ లేఖ..
Ys Vijaya
Follow us

|

Updated on: Apr 05, 2021 | 10:03 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సతీమణి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయా రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తమ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. వైఎస్ వివేకా హత్య, జగన్ జైలుకు వెళ్తారంటూ గత కొద్ది రోజులుగా తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ భార్యగా తనపై ఉందన్న విజయ.. ఆ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలు మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విజయ రాజశేఖర్ రెడ్డి రాసిన లేఖ యధావిధిగా.. ‘‘మూడు రోజులుగా ఎల్లో మీడియాలో, రాజకీయంగా మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్‌ వైయస్సార్‌గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను.

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజలలో చంద్రబాబు బలాన్ని పెంచలేం అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ, టీడీపీకి మద్దతు ఇచ్చే పలు మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. గత ఏడేళ్ళుగా పవన్‌ కల్యాణ్‌ కూడా వారి బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్‌ చేయటం కూడా అందరికీ తెలిసిన విషయమే.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌బాబు నేతత్వంలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నాం అని ప్రకటించటాన్ని కూడా చూశాం. ఎల్లో మీడియా రాజకీయంగా ఎవరి కోసం ఈ పని చేస్తోందో అందరికీ తెలుసు. చిన్న గీతను పెద్దది చేయలేం కాబట్టి, పెద్దగీతను చెరిపి చిన్నది చేసేందుకు పైన చెప్పిన పార్టీలు, వ్యక్తులు ఒకే మాట, ఒకే బాటగా అబద్ధాలు చెప్పటం ప్రారంభించారు. వారు చెప్పిన అసత్యాలను ప్రజలు ఏనాడూ పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టే ఆనాడు మహానేతకు, ఇప్పుడు జగన్‌‌కు ప్రజలు ఇంతగా బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ప్రజలను ఒప్పించడం సాధ్యం కావటం లేదు కాబట్టి, మా కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని మమ్మల్ని తగ్గించాలని ఓ పత్రిక యజమాని చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే.. ఆయన చేసేది జర్నలిజమేనా అనిపిస్తోంది.

వైయస్‌ వివేకానందరెడ్డిగారు మా మరిదిగారు. ఆయన్ను 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందే. ఇది నామాట.. ఇదే జగన్‌ మాట.. ఇదే షర్మిల మాట. ఇందులో మా కుటుంబంలో ఎప్పటికీ రెండు అభిప్రాయాలు లేవు. హత్య జరిగినది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 మార్చిలో. ఆ హత్య తరవాత రెండున్నర నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి పాత్రమీద అనేక అనుమానాలున్నాయి. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన్ను తిరుపతిలో స్టేజీమీద పెట్టుకున్న పవన్‌ కల్యాణ్, దర్యాప్తు సీబీఐ చేతిలో.. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్‌ మీద విమర్శలు చేశారు.

ఇక్కడే మరో విషయం.. జగన్‌మీద హత్యాయత్నం 2018 అక్టోబరులో జరిగితే.. 2019 మే చివరి వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అంటే దర్యాప్తునకు సంబంధించిన కీలక సమయంలో మా ప్రత్యర్థి, కుటుంబ పరంగా కూడా మమ్మల్ని ద్వేషించే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ కేసుల్ని డీల్‌ చేశారన్న నిజాన్ని కూడా మరచిపోయి ఇప్పుడు ఆ దర్యాప్తును కేంద్రం చేస్తోంది అని తెలిసి కూడా, ఈ రోజు ఏదీ ఎవరికీ గుర్తు లేదన్నట్టు పత్రికల్లో, టీవీల్లో, సభల్లో, ప్రెస్‌మీట్లలో ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. దర్యాప్తు సీబీఐ, ఎన్‌ఐఏ చేయాలి. ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కావు. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దర్యాప్తు వేగం పెంచాలని మధ్యలో జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది.

నిజాలు ఇలా ఉంటే పత్రిక, టీవీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. డాక్టర్‌ సునీత ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలంటారు. వివేకానందరెడ్డిగారిమీద జగన్‌ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయంటారు. సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు న్యాయం జరగటం లేదని సునీతమ్మ కుంగిపోతోందని రాశారు. అదే సమయంలో షర్మిలమ్మ కూడా సునీతకు మద్దతుగా నిలబడ్డారని రాశాడు. మా బంధు వర్గం కూడా రెండుగా చీలిపోయిందని, జరుగుతున్న పరిణామాలు చూసి నేను కూడా మానసికంగా కుమిలిపోతున్నానని రాశారు.

వివేకానందరెడ్డి గారి మీద జగన్ చేయి చేసుకోవటం ఏమిటి? వయసులో పెద్ద అయితే ఇంట్లో తోటమాలిని కూడా అన్నా అని సంబోధించే మనస్తత్వం జగన్‌ది. సంవత్సరాల తరబడి జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రల్లో జగన్‌ స్వభావం, మనస్తత్వం ఎలాంటివో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఈ విషయాలు అందరికీ తెలుసు.. ఇంతటి తీవ్రమైన అసత్య ఆరోపణలు ఏ నోటితో చేయగలుగుతున్నారు? వివేకానందరెడ్డి గారి వర్ధంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నారని రాశారు. నిజానికి ఆ సందర్భంలో నన్ను హాజరు కావాల్సిందిగా జగన్‌ తానే నాకు చెప్పాడు. ఇలాంటి సందర్భాల్లో వెళ్ళ వద్దనే కుసంస్కారాలు మా ఇంటా వంటా లేవు. నా పిల్లల్ని చూసి, వైయస్సార్‌ భార్యగా, వారి తల్లిగా ఎప్పుడూ గర్వపడ్డానే తప్ప నేనెందుకు కుంగిపోవాలి? నా పిల్లలు ఇద్దరూ ప్రజాసేవలో ఉన్నారని, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తున్నారని.. ఎలాంటి ఎదురుగాలిని అయినా తట్టుకుని జగన్‌బాబు నిలబడ్డాడని… పరిపాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని.. మహానేతకు భార్యగా, ఏపీ ముఖ్యమంత్రికి తల్లిగా ఉన్న నేను గర్వపడతానా? లేక కుంగిపోతానా? షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మింది. ఓదార్పు యాత్ర కావచ్చు.. పాదయాత్ర కావచ్చు.. తెలంగాణలో అవకాశం అన్నకు కాకుండా, దేవుడు తనకే ఇచ్చాడంటే దాని అర్థం తెలంగాణ ప్రజలతో తనకు అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని ఆమె నమ్ముతోంది. కాబట్టి షర్మిల తెలంగాణలో ముందడుగు వేస్తోంది. ఎల్లో మీడియా పిచ్చిరాతల్లో నా బిడ్డలమధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అది ఏనాటికీ జరగని పని.

ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ తనకు పొరుగున ఉన్న ఏ రాష్ట్రం ముఖ్యమంత్రితో అయినా, అక్కడి ప్రభుత్వంతో అయినా తన రాష్ట్ర శ్రేయస్సు దష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ను తెలంగాణలో నడిపించటం కుదరదని స్పష్టం చేశారు. ఆ కారణంగా ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజల్లో ప్రజాసేవలో ఉండాలని షర్మిల నిర్ణయించుకుంది. ఇవి వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు కావు. అయినా ఓ వీక్లీ సీరియల్‌గా అసత్యాలతో కథలు రాశారు. ఇక సునీత విషయానికి వద్దాం. వివేకానందరెడ్డి గారిని హత్య చేసినవారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలన్నదే సునీత డిమాండ్‌. అదే మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ విషయంలో మా అందరి మద్దతూ ఆమెకు ఉంది. మహిళలపట్ల జగన్‌కు ఉన్న అత్యంత గౌరవం, అభిమానం ఆయన పాలనలో అనేక పథకాల్లో కనిపిస్తూనే ఉన్నాయి.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, స్వయంగా తనకు సంబంధించిన కేసే అయినా.. లేక తన బాబాయి హత్య కేసే అయినా.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను చేయగలిగినది ఏముంటుంది? ఇవన్నీ అందరికీ అర్థం అవుతున్న నిజాలు. అంతెందుకు? డాక్టర్‌ వైయస్సార్‌గారి మరణాన్నే తీసుకోండి.. ఆయనది మరణమా? లేక హత్యా? అన్న అనుమానం ఆ రోజు అందరిలో ఉంది. మాకూ ఆ అనుమానం ఉంది. కానీ అప్పుడైనా మేం ఏం చేయగలిగాం? మా సంస్కారాలను తెలుగుదేశం వారు, వారి అనుకూల మీడియా అధిపతులు గౌరవించకపోయినా పరవాలేదు. కానీ ఈ కుటిలమైన రాతలేమిటి? బురదపూయటం వారి పని, శుభ్రం చేసుకోవటం మా కుటుంబం పని అన్నట్టుగా రాస్తున్న ఈ రాతలనిండా చంద్రబాబుకు అధికారం పోయిందన్న కడుపు మంటతో పాటు జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న ఈర్ష్య కూడా చంద్రబాబులో, ఆయన ఆనుచరుల్లో ఏమాత్రం దాగటం లేదు.

నేను ముందుగానే చెప్పినట్టు.. వీరు తమ మీడియాలో ఎంతగా చంద్రబాబు భజన చేస్తున్నా దాని వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు కాబట్టి వీరికి ఇక మిగిలిన దారేమిటి? అసత్యాలు, కట్టుకథలతో ఇక వైయస్సార్‌ కుటుంబం మీద పడాలన్న నిర్ణయంతోనే గడచిన ఏడాదిగా ఇలాంటి రాతలు మరీ ఎక్కువయ్యాయి. రాష్ట్రపతి, జగన్‌ ఏం మాట్లాడుకున్నారు? ప్రధాని, జగన్‌ ఏం మాట్లాడుకున్నారు? అని వారిద్దరి మధ్యా వీరే ఉన్నట్టుగా వన్‌ టూ వన్‌ సంభాషణల్ని కూడా ఏవేవో ఊహించుకుని దాన్ని న్యూస్‌గా ప్రింట్‌ చేసే పత్రికలతో, అలాంటి వార్తల్ని పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టే పార్టీలతో మా కుటుంబం గత నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అసత్యాలను ఇంతగా నమ్ముకుని పత్రికల్ని, పార్టీల్ని నడుపుకునే కంటే వీరంతా వేరే ఏదన్నా పని చేసుకుంటే బాగుంటుంది.’’ అని విజయ రాజశేఖర్ రెడ్డి తాను రాసిన బహిరంగ లేఖలో తీవ్రంగా స్పందించారు.

Also read:

ACB Reveals Shocking Facts: బెజవాడ దుర్గగుడిలో అదే జరుగుతోందా..? రిపోర్ట్‌లో అసలు ఏముంది ? వారి అవినీతి లోతెంత?

ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు… లంచ్‌గా అన్నంలో నీరు,ఉల్లిపాయ… హార్ట్‌టచింగ్‌ స్టోరీ వీడియో

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..