Andhra Rains: ఏపీపై దండయాత్ర ప్రకటించిన వరుణుడు.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Andhra Rains: ఏపీపై దండయాత్ర ప్రకటించిన వరుణుడు.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Andhra Weather Report

Updated on: Aug 10, 2025 | 7:14 PM

దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, పాత హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున, రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో, పశువులు మేపే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తాజా వాతావరణ రిపోర్ట్ ప్రకారం… బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడితే, గాలుల వేగం పెరిగి, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.

ఈ వర్షాల ప్రభావం ముఖ్యంగా నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, తెనాలి, ఓంగోలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వంటి దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైతులు, మత్స్యకారులు ఈ రెండు రోజులు వాతావరణ సూచనలను గమనిస్తూ ఉంటే బెటర్. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల కలెక్టర్లను, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామ పంచాయతీ శాఖలను అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం చేసింది. అవసరమైతే తాత్కాలిక నివాస కేంద్రాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం ఇప్పటికే మేఘావృతంగా మారింది. రాబోయే 48 గంటలు వర్షాలతో పాటు పిడుగులు, గాలివానలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ప్రజలు అధికారుల సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..