AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు.. వాటర్ లెవల్స్ రిపోర్ట్..

|

Aug 08, 2024 | 8:03 PM

తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలు, వరదలతో జలకళ సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. అటు నాగార్జునసాగర్‌ దగ్గర 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు.. వాటర్ లెవల్స్ రిపోర్ట్..
Prakasam Barrage
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరిగింది. దీంతో మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 93 వేల 141 క్యూసెక్యులు కాగా, ఔట్‌ ఫ్లో 2 లక్షల 79 వేల 150 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశారు.
గత కొన్ని రోజులుగా ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజ్‌ జలకళను సంతరించుకుంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 లక్షల 74 వేల 309 క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 26 క్రస్టు గేట్స్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3 లక్షల 74 వేల 304 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 2 లక్షల 69 వేల 562 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 298 టీఎంసీలుగా ఉంది. ఇటు సాగర్‌ క్రస్ట్‌ గేట్లు ఓపెన్‌ చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పిల్లా పాపలతో తరలివస్తున్నారు. దీంతో ఈ ఏరియాలో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో నాగార్జునసాగర్‌ నుంచి దిగువకు నీటి విడుదల మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..