నాలాలపై అక్రమకట్టడాలు… కూల్చివేతలు ప్రారంభం
హైదరాబాద్లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు.
భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. పట్టణంలో పలు చోట్ల నాలాలు ఉప్పొంగి కాలానీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల రోడ్లు, బస్తీలు చెరువులను తలపించాయి. అయితే, నగరంలో ఈ దుస్థితి కారణం నాలాల అక్రమ కట్టడాలుగా గుర్తించిన అధికారులు వాటి తొలిగింపు దిశగా చర్యలు మొదలు పెట్టారు.
హైదరాబాద్లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. శనివారం జీహెచ్ఎంసీ సిబ్బంది మల్కాజ్గిరితోపాటు పటేల్నగర్లో నాలాలపై అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అక్రమకట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ మల్కాజ్గిరి ప్రాంతంలో పర్యటించి అక్రమ కట్టడాల కూల్చివేతకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు. నాలుగురోజుల కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమైన సంగతి తెలిసిందే. చెరువు శిఖాలు, నాలాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కారణం వరద వెల్లేందుకు వీల్లేక ఈ పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.