ఏపీలో 133 హాట్స్పాట్స్..కరోనా @ 381..అష్టదిగ్భంధంలో కంటైన్మెంట్లు
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, పాజిటివ్ తీవ్రతతో మృతి చెందినవారు నివాసం ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ (కంటైన్మెంట్ జోన్లు)గా గుర్తించిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, పాజిటివ్ తీవ్రతతో మృతి చెందినవారు నివాసం ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్స్ (కంటైన్మెంట్ జోన్లు)గా గుర్తించిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు. ఏపిలో ఇప్పటి వరకు మొత్తం 133 ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 30 ప్రాంతాలు, కర్నూలులో 22, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 12, ప్రకాశంలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ప్రాంతాలను గుర్తించారు. అసలు రెడ్జోన్లు లేని జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నిలిచాయి.
విజయవాడలో కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాత్ ఆర్ ఆర్ పేట, కృష్ణలంక రాణీగారితోట, ఖుద్దూస్నగర్, పాయకాపురం, శాంతినగర్, కానురు ప్రాంతాలను రెడ్ జోన్లుగా పరిగణించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పోలీసులు ఎవర్నీ అనుమతించడం లేదు. అక్కడ నివాసితుల కోసం నిత్యావసరాలను నిర్ధేశిత వేళల్లో అందుబాటులో ఉంచుతున్నారు. అంతేగాక ఎవరైనా రెడ్ జోన్లలో ఉంటున్న వారికి ఆహారం ఇవ్వాలన్న పోలీసుల అనుమతి ఉంటేనే అనుమతిస్తున్నారు. ఆ ఆహారాన్ని నగరపాలక సంస్థ సిబ్బంది ద్వారా మాత్రమే అందించేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఆయా రెడ్ జోన్లలో పరిస్థితిని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా, చిలకలపూడి సెంటర్ , కొబ్బరితోట, నవీన్మిట్టల్ కాలనీ, చిలకలపూడి రైల్వే గేట్, లక్ష్మణరావు పురం రోడ్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు కొత్తవారిని పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు ఆయా రెడ్ జోన్ల ప్రాంతాలను పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాలకు ఆటోల ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే కరోనా నిర్ధారిత ప్రాంతాలను గుర్తించిన అధికారులు, ఆయా ప్రాంతాలను పోలీసులకు అప్పగించారు. ప్రతి జోన్లో ఎస్ఐ ఇన్చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.
రోడ్ల పైకి బైక్లపై విచ్చలవిడిగా వచ్చే యువకుల వాహనాలను పోలీసులు భారీగానే స్వాధీనం చేసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుమి కూడుతున్నది కూడా పోలీసులు ఆరా తీసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. అత్యవసరమైతే తప్ప ఎవరినీ బయటకు రానీయడం లేదు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు.