
బెజవాడలో ఔట్సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెరిగింది. నగర వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. మొత్తం 20 బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలలా హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్షాపులపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. లోపలికెళ్లగానే కిచెన్లన్నీ కంపు కొడుతూ చెత్తకుండీల్ని తలపిస్తూ భయానకంగా కనిపించాయి.
పాడైపోకుండా ఫ్రిజ్లో పెట్టే పదార్థాలు కూడా బైటికి తీస్తే నీరుగారుతూ కుళ్లిపోయి కనిపించాయి. ఆహారాల తయారీలో వాడుతున్న కలర్స్ ఏంటి, మిగతా ఇన్గ్రేడియంట్స్ ఏంటి ఆరా తీశారు అధికారులు. కాలం చెల్లిన పదార్థాల్ని సీజ్ చేశారు. ఇక్కడ అధికశాతం ఆహార పదార్థాలు పూర్తిగా పాడై, తినడానికి అస్సలు వీల్లేనివే. బ్రెడ్లు, సలాడ్లు, మాంసాహార పదార్థాలు.. ఏది పట్టుకున్నా మురికి కంపు కొట్టడాన్ని చూసి షాకయ్యారు అధికారులు.
కొన్ని హోటల్స్ ఐతే కనీస అనుమతులే లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రెండుమూడురోజుల కిందట వండిన పదార్థాల్ని కూడా కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు తేల్చారు. ఒక రెస్టారెంట్లో క్వింటాలు దాకా వేస్ట్ ఫుడ్ అమ్మకానికి పెట్టేశారు. వీటి మీద ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటివరకు అమ్ముకోవచ్చు అనే లేబుల్సే లేవు. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ పూర్ణచంద్రరావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.