Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌.. 11 రోజుల పాటు దీక్ష చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం..

|

Sep 22, 2024 | 11:06 AM

లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని. అందులో భాగంగా ఈరోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని అన్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్‌ కళ్యాణ్‌.. 11 రోజుల పాటు దీక్ష చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం..
Pawan Kalyan
Follow us on

ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నట్లు శనివారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. అమృతతుల్యంగా, పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలీనమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని. అందులో భాగంగా ఈరోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని అన్నారు పవన్ కళ్యాణ్.

“ఏడుకొండలవాడా..! క్షమించు.. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.

22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా… నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః” అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.