Andhra Pradesh: చిత్తూరులో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం.. కొడుకు పుట్టినరోజు నాడే..
రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ కర్మాగారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
Chittoor Fire Accident: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు. రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ కర్మాగారంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన రెండంతస్తుల భవనంలో పేపర్ ప్లేట్ల తయారీతో పాటు నిర్వాహకులు ఉంటున్నారు. చనిపోయిన ముగ్గురిలో తండ్రి కొడుకుతోపాటు అతని స్నేహితుడు ఉన్నారు. మృతులు యజమాని భాస్కర్(65), అతని కొడుకు డిల్లీ బాబు(35), బాలాజీ(25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.
కాగా.. సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అప్పటికే స్థానికులు ఇంటి గోడలు పగలగొట్టి స్పృహ కోల్పోయిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రమాదంలో మృతి చెందిన ఢిల్లీ బాబు పుట్టినరోజు నాడే తండ్రి స్నేహితుడు కలిసి మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూ టౌన్ పోలీసులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..