Chandrababu Naidu: “పులివెందుల బాంబులకు భయపడను.. పోలీసులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు”.. చంద్రబాబు పైర్
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార వైసీపీ.. టీడీపీ, విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే వీటిని దీటుగా ఎదుర్కొని.. ఘాటుగానే..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార వైసీపీ.. టీడీపీ, విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే వీటిని దీటుగా ఎదుర్కొని.. ఘాటుగానే జవాబిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలో సీఎం జగన్ తీరుపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నేర చరత్రపై పోరాటం చేస్తామన్న చంద్రబాబు.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల్ని విడిచి పెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కుప్పంలో అన్న క్యాంటీన్ను ధ్వంసం చేసిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్ (Anna Canteen) ను కూల్చొద్దని అడ్డుకున్న.. టీడీపీ కార్యకర్తలపైనే రివర్స్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారన్న చంద్రబాబు..175 స్థానాల్లోనే కాదు పులివెందులలోనూ టీడీపీ గెలుస్తుందని సవాల్ విసిరారు. పోలవరం, అమరావతిపై ముఖ్యమంత్రి అసత్యాలు చెబుతున్నారని, ఆ పాపం జగన్ దే నని తీవ్రంగా విమర్శించారు.
టీడీపీ సంపద సృష్టిస్తే వైసీపీ విధ్వంసం చేస్తోంది. వారు చేసే పనులను అడ్డుకుంటుంటే కేసులు పెడుతున్నారు. పులివెందుల బాంబులకు భయపడేవారు ఎవరూ లేరు. ప్రజాసమస్యలపై పోరాడతాం. కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు. కుప్పం అన్న క్యాంటీన్ ఘటనలో తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మీరే దాడులు చేసి, తిరిగి మీరే టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారుల్ని వదిలిపెట్టం.
– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
మరోవైపు.. ఈ నెల 23 న కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటించనున్నారు. టార్గెట్ 175గా పని చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే మార్పును ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..