
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 8 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం, మరణించిన వారి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కర్మగారంలోని SMS‑1(స్టీల్ మెల్టింగ్ షాప్ 1) లోని CCD (కంటిన్యూస్ కాస్టింగ్ డిపార్ట్మెంట్) విభాగంలో లాడిల్ పేలి లిక్విడ్ ఐరన్ కారడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 15 మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నట్లు సమాచారం. లిక్విడ్ ఐరన్ తాకడంతో 8 మంది మృతి చెందగా, మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఫైర్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
తీవ్రంగా గాయపడిన వారు..
గాయపడిన వారికి సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మరణించిన వారి మృతదేహాలకు నేడు KGH మార్చురిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రుల్లో పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. బోకారో స్టీల్ ప్లాంట్ సహా ఇతర ఉక్కు కర్మాగారాలకు చెందిన ముగ్గురు నిపుణులు కమిటీలో ఉన్నారు. కమిటీ నేడు స్టీల్ ప్లాంట్ను సందర్శించి SMS‑1 CCD ఘటన స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించనుంది. మంగళవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి