Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు.. పెరిగిన సందర్శకుల తాకిడి..
Srisailam Dam 10 Gates: తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతూనే ఉంది. దీంతో తాజాగా రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తారు. ఆటు కృష్ణానది ఇటు తుంగభద్ర నది నుంచి..
తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రీశైలం డ్యామ్కు భారీ వరద కొనసాగుతూనే ఉంది. దీంతో తాజాగా రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తారు. ఆటు కృష్ణానది ఇటు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున శ్రీశైలం డ్యామ్కు వరద వస్తుంది. కృష్ణా నది నుంచి మూడు లక్షలు, తుంగభద్ర నది నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్లో కలుస్తుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం శరవేగంగా పెరిగింది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 175 టీఎంసీలు ఉంది. డ్యాం నిండాలంటే మరో 35 టీఎంసీలు మాత్రమే అవసరం.
అయితే, నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వస్తుండటంతో, పూర్తిగా నిండే అవకాశం ఉంది. దీంతో నిన్నటి రోజుల కొన్ని గేట్లు ఎత్తే ఎత్తిన అధికారులు..ఈ రోజు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు వెళ్తోంది.
కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక, శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. మరోవైపు.. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు అక్కడి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. దీంతో.. పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కోరినట్లుగా రైట్ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. డ్యాం నిండే అవకాశం ఉండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు.