Mission Electrificatiion: ఆ మార్గాల్లో విద్యుదీకరణ పూర్తి.. వేగవంతం కానున్న రైల్వే ప్రయాణం
రాయలసీమ వాసులకు ఇకపై రైల్వే సేవలు(Train Services) మరింత సులభం కానున్నాయి. ఈ మేరకు కదిరి - తుమ్మణంగుట్ట, పాకాల - కలికిరి, డోన్ - కర్నూలు సిటీ సెక్షన్లలో 163 కిమీల విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే...
రాయలసీమ వాసులకు ఇకపై రైల్వే సేవలు(Train Services) మరింత సులభం కానున్నాయి. ఈ మేరకు కదిరి – తుమ్మణంగుట్ట, పాకాల – కలికిరి, డోన్ – కర్నూలు సిటీ సెక్షన్లలో 163 కిమీల విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. భారతీయ రైల్వే ఏర్పరుచుకున్న ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్’ లక్ష్యాన్ని బలోపేతం చేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే తన నెట్వర్క్ పరిధిలో రైల్వే లైన్ల విద్యుదీకరణను(Electrification) వేగవంతం చేసింది. ఈ దశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలోని వేర్వేరు సెక్షన్ల రైల్వే లైన్లలో(Railway line) 163 కిలోమీటర్ల రూట్ విద్యుదీకరణ పూర్తయింది. కదిరి – తుమ్మణంగుట్ట మధ్య 53.30 కి.మీలు, పాకాల – కలికిరి మధ్య 55.80 కి.మీలు, డోన్ – కర్నూలు సిటీ మధ్య 54.20 కి.మీల రూట్ ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ధర్మవరం – పాకాల విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా కదిరి – తుమ్మణంగుట్ట మధ్య, పాకాల – కలికిరి మధ్య విద్యుదీకరణ జరిగింది. 228 కిమీల మేర గల ఈ ప్రాజెక్టు రూ.253 కోట్ల అంచనా వ్యయంతో 2017-18 సంవత్సరంలో మంజూరైంది. ధర్మవరం-కదిరి సెక్షన్ మధ్య 67 రూటు కి.మీల మేర 2021 మార్చిలోనే పూర్తైంది. ఇప్పుడు, మరో రెండు సెక్షన్లలో పూర్తి కావడంతో మొత్తం సెక్షన్లో 176 కి.మీలు విద్యుదీకరణ పూర్తయింది. తుమ్మణంగుట్ట – కలికిరి మధ్య 52 కి.మీల మేర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
డోన్ – కర్నూల్ సిటీ – ముద్ఖేడ్ – మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా డోన్ – కర్నూల్ సిటీ సెక్షన్ మధ్య విద్యుదీకరణ పూర్తి అయ్యింది. 783 కిమీల ఈ ప్రాజెక్టు రూ.900 కోట్ల అంచనా వ్యయంతో 2015 – 16 సంవత్సరంలో మంజూరు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డోన్ – కర్నూల్ సిటీ భాగంలో విద్యుదీకరణ అయ్యింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజీవ్ కిశోర్ జోన్లో విద్యుదీకరణ పనులు పూర్తి చేయడంలో కృషి చేసిన జోనల్ మరియు డివిజినల్ స్థాయి రైల్వే అధికారులను అభినందించారు. జోన్ పరిధిలో 2023 నాటికి విద్యుదీకరణ పూర్తి చేసేలా పనులను మరింత వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్ సూచించారు.
- ఇంజన్ మార్పు సమయాన్ని తగ్గించి నిరాటంకంగా రైళ్లు నడపవచ్చు.
- ప్రయాణికుల, రవాణా రైళ్ల ఆలస్యాన్ని నివారించవచ్చు.
- రైళ్ల సగటు వేగం పెరుగుతుంది.
- రైళ్ల నిర్వహణలో ఇంధన ఖర్చును తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.